పాకిస్తాన్కు తీసుకెళ్తాం..విమానాశ్రయాలను వణికించిన ఫోన్ కాల్ః పరుగులు పెట్టిన అధికారులు
న్యూఢిల్లీః ఒక్క ఫోన్ కాల్ కేంద్ర ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురిచేసింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారులను పరుగులు పెట్టించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎయిరిండియా విమానాలను హైజాక్ చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పౌర విమానయాన మంత్రిత్వశాఖకు ఫోన్ చేశాడు. ఎయిరిండియా విమానాలే తమ టార్గెట్ అని, కనీసం రెండు విమానాలైనా తాము దారి మళ్లిస్తామని హెచ్చరించాడు. వాటిని పాకిస్తాన్కు తీసుకెళ్తామని బెదిరించాడు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన తరువాత..
ఈ తరహా ఫోన్ కాల్స్ను పెడచెవిన పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. వెంటనే రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సీఐఎస్ఎఫ్ను ఆదేశించింది. దీనితో సీఐఎస్ఎఫ్ అధికారులు విమానాశ్రయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గస్తీ ముమ్మరం చేశారు. అదనపు భద్రతను కల్పించారు. ప్రయాణికులు, వారు వెంట తెచ్చుకున్న లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. 48 గంటల పాటు ఈ హై అలర్ట్ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది. విమానాశ్రయాల పరిసరాల్లో వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రదాడి తరువాత దేశంలోని విమానాశ్రయాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా ఈ హైజాక్ బెదిరింపు ఫోన్కాల్ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఉగ్రదాడి తరువాత ఏ చిన్న విషయాన్ని కూడా తాము తేలిగ్గా తీసుకోవట్లేదని సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో అదనపు బలగాలను మోహరింపజేశామని, క్విక్ యాక్షన్ టీమ్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. కార్గో, వాహనాల ఎంట్రీ గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. దీనికంతటికీ కారణమైన ఫోన్ కాల్ పై కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఆరా తీస్తోంది.