పాక్ గగనతలం మూసివేయడంతో ఎయిరిండియాకు భారీ నష్టం..ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: బాలాకోట్ దాడుల తర్వాత పాక్ గగనతలంను మూసివేయడంతో భారత ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టాలు వచ్చాయి. జూలై 2వ తేదీ వరకు ఎయిరిండియాకు వచ్చిన నష్టం అక్షరాల రూ.491 కోట్లు అని పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో తెలిపారు. ఇక ప్రైవేట్ సంస్థలు అయిన స్పైస్ జెట్, ఇండిగో, గోఎయిర్ సంస్థలకు వరుసగా రూ.30.73 కోట్లు, రూ.25.1 కోటి, రూ. 2.1 కోటి నష్టం వాటిల్లినట్లు ఆయన బుధవారం సభకు వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఇండియన్ ఎయిర్ఫోర్స్ బాలాకోట్లో మెరుపుదాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ తన గగనతలంను మూసివేస్తూ భారత విమానాలపై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే మొదట్లో భారత గగనతలంను మూసివేస్తున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మే 30న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ తన గగనతలంపై ఆంక్షలు విధించడం తన ఏకపక్షధోరణిని తెలియజేస్తోందని అయినప్పటికీ ఆదేశ ప్రభుత్వం విజ్ఞతకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని మంత్రి సభకు తెలిపారు.