పైలట్ల నిర్లక్ష్యం: కొద్దిగుంటే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి
విమానం నడిపే పైలట్ల పోకడలకు ప్రయాణికులకు భద్రత లేకుండా పోతోంది. కొన్ని వందల మంది ప్రయాణికుల ప్రాణాలు పైలట్ల చేతిలో ఉంటాయి. కానీ ఈ పైలట్లు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. అంతమందిని గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత కలిగిన వీరు కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జాతీయ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. ఒకరు ఫుల్గా మద్యం సేవించగా మరొక పైలట్ మద్యం పరీక్షకు హాజరుకాకుండానే విమానంను టేకాఫ్ చేశాడు.
మద్యం సేవించి విమానం నడిపేందుకు సిద్ధమైన పైలట్
ఆదివారం రోజున రెండు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి వారు విమానాశ్రయంలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు వేర్వేరు విమానాలకు చెందిన పైలట్లే ఇందుకు కారణం. ఢిల్లీ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంకు సంబంధించిన సీనియర్ పైలట్ మద్యం సేవించినట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులో తేలింది. కెప్టెన్ అరవింద్ కత్పాలియా అనే ఈ సీనియర్ పైలట్ రక్తంలో మద్యం ఆనవాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఆయన బోయింగ్ విమానం 787 డ్రీమ్లైనర్ను నడపాల్సి ఉంది . ఇది గమనించిన అధికారులు అరవింద్పై మూడేళ్లపాటు నిషేధం విధించారు. వెంటనే ఈ విమానంను నడిపేందుకు మరో సీనియర్ పైలట్ను అధికారులు పిలిపించారు.
ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్...దంతెవాడలో నక్సల్స్ దాడి
ఆల్కహాల్ టెస్టుకు హాజరు కాకుండానే టేకాఫ్ చేసిన కోపైలట్
ఇదిలా ఉంటే మరో ఎయిర్ ఇండియాకు చెందిన కోపైలట్ ఆల్కహాల్ టెస్టుకు హాజరు కాకుండానే విమానంను టేకాఫ్ చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 332 విమానం ఢిల్లీ నుంచి బ్యాంకాక్కు వెళుతోంది. అయితే అందులోని కోపైలెట్ ఆల్కహాల్ టెస్టుకు హాజరుకాకుండానే విమానంను టేకాఫ్ చేశారు. విమానం టేకాఫ్ అయిన అరగంటకే తిరిగి ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించడంతో ఆ విమానం మళ్లీ ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. కో పైలట్ కారణంగా కొన్ని గంటల ఆలస్యంగా విమానం బ్యాంకాక్కు బయలుదేరింది. కో పైలట్ కారణంగా ఆయన ఫ్లైయింగ్ టైమ్ కూడా తగ్గిపోవడంతో మరో పైలట్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విమానం నాలుగు గంటల ఆలస్యంగా బ్యాంకాక్కు బయలుదేరింది.
విమానాశ్రయంలోనే గంటల తరబడి నిలిచిపోయిన విమానం
"ఒక ప్రకటన లేదు, ఒక పైలట్ లేరు.. ఏం జరుగుతోంది? బ్యాంకాక్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఇంకా ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉంది. ప్రయాణికులంతా తమ సీట్లలోనే కూర్చుని ఉన్నారు. ఇప్పటికే నాలుగు గంటలు గడిచిపోయాయి"అంటూ కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఒక ప్రయాణికుడు ట్వీట్ చేశారు. మరోవైపు ఆల్కహాల్ టెస్టు తీసుకోకుండా విమానం టేకాఫ్ చేస్తే విమానాయాన శాఖ నిబంధనల ప్రకారం వారిని మద్యం సేవించిన వారిగానే భావిస్తారు. ఈ ఘటనలో కూడా కోపైలట్ మద్యం సేవించనప్పటికీ... మద్యం సేవించిన వారిగానే భావించి ఆయన్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే విమానం నడపక ముందు విమానం నడిపిన తర్వాత పైలట్లు తప్పని సరిగా ఆల్కహాల్ టెస్టుకు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది.