స్వీడెన్లో ఎయిర్ ఇండియా విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిరిండియా విమానంకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్టాక్హోమ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 179 మంది ప్రయాణికులు ఉన్న ఎయిర్ ఇండియా విమానం స్విట్జర్లాండ్ రాజధాని స్టాక్హోమ్లో పార్క్ చేస్తుండగా విమానం రెక్క ఒక భవంతిని తాకడంతో ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం భారతకాలమాన ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది.అర్లాండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని టర్మినల్ 5లో అంతర్జాతీయ విమానాలను పార్క్ చేస్తారు. ఇక్కడే ఎయిరిండియా విమానం రెక్క ఒకటి పక్కనే ఉన్న భవంతి కొనకు తగులుకుని చిక్కుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన అధికారులు వెంటనే ఫైర్ ఇంజిన్లను, పోలీసు వాహనాలను విమానం దగ్గరకు పంపారు. ప్రయాణికులంతా క్షణాల్లో మొబైల్ స్టేర్ కేస్ ద్వారా బయటకు వచ్చారు.
న్యూఢిల్లీ నుంచి విమానం వచ్చినట్లు స్వీడన్ ఎయిర్పోర్టు అధికారి రాబర్ట్ ప్లెట్జిన్ చెప్పారు. అయితే అసలు ఏమి జరిగిందనేదానిపై ఇప్పుడప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు.విచారణకు ఆదేశించినట్లు రాబర్ట్ చెప్పారు. అయితే విమానం ప్రమాదానికి గురవడంతో ఎయిర్పోర్టులో కలకలం రేగిందన్నారు. ప్రమాదం జరిగిందన్న విషయం బయటకు పొక్కగానే రన్వే అంతా పోలీసు వాహనాలు, ఫైర్ ఇంజిన్లతో నిండిపోయిందని మరో వ్యక్తి తెలిపారు.