‘‘నేనేం విలన్ కాదు.. మీకు తెలిసింది కొంతే.. అసలేం జరిగిందో అక్కడ వెల్లడిస్తా..’’
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ త్వరలోనే తన దురుసు ప్రవర్తనపై పార్లమెంట్ లో వివరణ ఇచ్చుకోబోతున్నారు.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకుని, నిషేధానికి గురై, విమాన ప్రయాణానికి దూరమైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ త్వరలో ఈ ఉదంతం గురించి వివరణ ఇచ్చుకోబోతున్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన తన చర్యను గట్టిగా సమర్థించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అసలు తీను చేయి చేసుకోవడానికి దారితీసిన కారణాలు, ఆ తరువాత జరిగిన పరిణామాలను ఆయన లోక్ సభలో వివరించే అవకాశం ఉన్నట్లు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
జరిగినదంతా తొలుత లోక్ సభలో వివరించిన తరువాతనే రవీంద్ర గైక్వాడ్ మీడియాను కలిసి మరోసారి వివరణ ఇస్తారని ఎంపీ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తానేమీ విలన్ కాదని, ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఒకవైపు కథ మాత్రమేనని, తెలియాల్సింది చాలా ఉందని, అది పార్లమెంటులోనే వెల్లడిస్తానని మీడియాతో ఆయన వ్యాఖ్యానించారట.
ఎయిర్ ఇండియా విమానంలోకి ఎక్కిన రవీంద్ర గైక్వాడ్ ఆ సంస్థ మేనేజర్ తో గొడవపడి ఆయన్ని 25 సార్లు చెప్పుతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మేనేజర్ ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికి నాలుగుసార్లు రవీంద్ర గైక్వాడ్ విమానంలో ప్రయాణించకుండా ఆ సంస్థ చర్యలు తీసుకుంది.