Coronavirus: ఎయిర్ లిఫ్టింగ్: భారతీయుల తరలింపు షురూ: ఎయిరిండియా జంబో ఫ్లైట్..!
Recommended Video
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాలో చిక్కుకున్న ప్రవాస భారతీయులను తరలించడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. చైనాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, విద్యార్థులు, పర్యాటకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో భాగంగా- ఎయిరిండియా జంబో బీ747 విమానాన్ని పంపించబోతోంది.
423 సీట్ల సామర్థ్యం గల జంబో జెట్..
ఈ విమానం శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లనుంది. 423 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం ఇది. భారతీయులను తరలించడానికి ఏర్పాటు చేసిన తొలి విమానం ఇది. న్యూఢిల్లీలో టేకాఫ్ తీసుకునే ఈ విమానం మధ్యాహ్నానికి వుహాన్ సిటీకి చేరుకుంటుంది. ఈ విమానం ద్వారా వుహాన్ సిటీ, పరిసర ప్రాంతాల్లో నివసిస్తోన్న 315 మంది ప్రవాస భారతీయులు, విద్యార్థులను స్వదేశానికి తరలిస్తారు.
రెండు విమానాలు..
రెండో విమానం శని లేదా ఆదివారాల్లో బయలుదేరి వెళ్తుంది. రెండో విడతలో హ్యూబే ప్రావిన్స్ సహా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ వెల్లడించారు. రెండు విమానాలను నడిపించడానికి అవసరమైన అనుమతులను తాము చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు కోరామని ఆయన తెలిపారు. అనుమతులు రావడం లాంఛనప్రాయమేనని, ఆ వెంటనే తాము తొలి విమానాన్ని పంపించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
హ్యూబే ప్రావిన్స్లో 600 మంది భారతీయులు..
వుహాన్ సిటీని కలుపుకొని ఒక్క హ్యూబే ప్రావిన్స్లోనే మొత్తం 600 మంది ప్రవాస భారతీయులు, విద్యార్థులు ఉన్నారని, వారందరితోనూ తాము సంప్రదింపులు జరిపామని అన్నారు. ఈ 600 మందికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్నాయని, తొలిదశలో 315 మందిని, మలిదశలో మిగిలిన వారిని తీసుకొస్తామని రావీష్ కుమార్ తెలిపారు. హ్యూబే ప్రావిన్స్లో ఎంతమంది ఉన్నారనే ఖచ్చితమైన వివరాలను ఇంకా సేకరిస్తున్నామని, ఏ ఒక్క భారతీయుడిని కూడా తాము అక్కడే వదిలేయబోని చెప్పారు.
ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
ప్రవాస భారతీయుల కోసం బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశామని రావీష్ కుమార్ చెప్పారు. రౌండ్ ద క్లాక్ తరహాలో పనిచేసే ఓ కంట్రోల్ రూమ్ను నెలకొల్పామని, మూడు హాట్ లైన్లను ఏర్పాటు చేశామని 24 గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. స్వదేశానికి రాదలచుకున్న భారతీయులు ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని ఆయన సూచించారు. మనదేశంతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా తమ దేశ పౌరులను తరలించడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.