ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం: రాత్రికిరాత్రే 48 మంది పైలట్ల తొలగింపు.. ఎందుకంటే..?
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 48 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది, వీరంతా గతేడాది రాజీనామా చేశారు. అయితే ఆరునెలల నోటీస్ పీరియడ్లో వారు కంపెనీ రూల్స్ ప్రకారం రాజీనామా వెనక్కి తీసుకొని.. తిరిగి విధుల్లో చేరారు. వారు ఎయిర్ బస్ 320 నడిపిస్తున్నారు.
ఎయిర్ ఇండియా ఆకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా పైలట్లను తొలగించాల్సి వచ్చిందని వారికి రాసిన లేఖలో తెలిపింది. కంపెనీ భారీ నికర నష్టాలను చవిచూస్తోన్న నేపథ్యంలో.. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తొలగించిన పైలట్లు గురువారం రాత్రి తమ సేవలను ముగించారని పేర్కొన్నది.
Recommended Video
పైలట్ల తొలగింపును ఇండియన్ కమర్షియల్ పైలట్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్కు ఒక లేఖ కూడా రాసింది. పైలట్లను ఉద్యోగం నుంచి తొలగింపుపై చైర్మన్ రాజీవ్ బన్సాల్ జోక్యం చేసుకోవాలని కోరింది. రాజీనామా చేసి.. వెనక్కి తీసుకున్న వారిని తొలగించడం సరికాదన్నారు. కరోనా, ఆర్థిక ఇబ్బందులు పేరు చెప్పి ఉద్యోగులను ఎలా తీసివేస్తారని ప్రశ్నించింది.