ఎయిరిండియా విమానాలు ఇకపై ఆ దేశం మీదుగా వెళ్లవు..కారణం ఇదే..!
న్యూఢిల్లీ: యూరప్, అమెరికా దేశాలకు వెళుతున్న ఎయిరిండియా విమానాలు దారి మళ్లాయి. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇరాక్ అమెరికాపై తాజాగా జరిపిన క్షిపణి దాడుల కారణంగా ఎయిరిండియా విమానాలకు సంబంధించి దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని అధికారులు తెలిపారు. ఇరాన్ గగనతలంలో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి ధనంజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఇక ఢిల్లీ నుంచి ఇరాన్ మీదుగా యూరప్, అమెరికా దేశాలకు వెళ్లాల్సిన విమానాలను దారి మళ్లించడంతో సమయం కాస్త ఎక్కువగా తీసుకుంటుందని ధనంజయ్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నుంచి వెళ్లే విమానాలకు 20 నిమిషాలు అదనంగా తీసుకుంటుండగా అదే ముంబై నుంచి వెళ్లే విమానాలకు 30 నుంచి 40 నిమిషాలు అదనపు సమయం తీసుకుంటుందని ధనంజయ్ వివరించారు. మిడిల్ ఈస్ట్ దేశాల మీదుగా వెళ్లే పలు కమర్షియల్ ఎయిర్లైన్స్ తమ విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా విమానాయాన సంస్థ యాజమాన్యాలు తెలిపాయి.
ఆస్ట్రేలియాకు చెందిన కాంటాస్ ఎయిర్లైన్స్ లండన్ పెర్త్ గగనతలంను ప్రత్యామ్నాయ దారిగా ఎంచుకుంది. ఇరాన్ ఇరాక్ గగనతలం మీదుగా ఇకపై విమానాలు ప్రయాణం చేయవని స్పష్టం చేసింది. ఈ మార్గం ఎంచుకుందంటే ఇక కాంటాస్ ఎయిర్లైన్స్ తమ విమానాల్లో తక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోవడంతో పాటు మిగులు ఇంధనం కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే అదనంగా మరో 40 నుంచి 50 నిమిషాల వరకు ఇంధనం సరిపడేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మలేషియా ఎయిర్లైన్స్ కూడా ఇరాన్ గగనతలంలో తమ విమానాల రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. సింగపూర్లో కూడా ఇదే తరహా పద్దతిని ఫాలో అవుతోంది.
ఇక ఇప్పటికే రష్యా ఏవియేషన్ ఏజెన్సీ కూడా తమ విమానాలు ఇరాన్, ఇరాక్, పర్షియన్ గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణించవని వెల్లడించగా... దుబాయ్ నుంచి బాగ్దాద్కు వెళ్లాల్సిన విమానంను రద్దు చేసినట్లు యూఏఈ ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. అయితే బస్రా మరియు నజాఫ్ ప్రాంతాలకు మాత్రం తమ విమానాలను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్ బాగ్దాద్లకు వెళ్లే విమానాలను రద్దు చేసింది. అయితే ఇరాక్కు తమ విమానాలు యాథతథంగా నడుస్తునట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది.