విమానం ఇంజన్ లో ఇరుక్కుని దుర్మరణం
ముంబై: పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్ స్టార్ట్ చెయ్యడంతో అక్కడే ఉన్న ఉద్యోగి ఇంజన్ లో ఇరుక్కుని దుర్మరణం చెందిన సంఘటన ముంబైలో జరిగింది. ఎయిర్ ఇండియాలో గ్రౌండ్ క్రూ సభ్యుడిగా (టెక్నీషియన్) ఉద్యోగం చేస్తున్న రవి సుబ్రమణియన్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.
ముంబైలోని చత్రపతి శివాజీ డొమెస్టిక్ ఎయిర్ పోర్టులోని 28వ బే వద్ద ఎయిర్ ఇండియాకు చెందిన విమానం A1 619 పార్క్ చేశారు. ఈ విమానం ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. బుధవారం రాత్రి 8.45 గంటల సమయంలో రవి సుబ్రమణియన్ ఆ విమానం దగ్గరకు వెళ్లారు.
విమానం ఇంజన్ దగ్గర పరిశీలిస్తున్నాడు. అదే సందర్బంలో విమానం కో-పైలెట్ ఒక సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. విమానం ఇంజన్ ఫ్యాన్లు రవి సుబ్రమణియన్ ను ఒక్క సారిగా లోపలికి లాగేసుకున్నాయి.
రవి సుబ్రమణియన్ సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు, సాటి ఉద్యోగులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వనీ లోహానీ తెలిపారు.