ఢిల్లీని వణికిస్తున్న వాతావరణం.... తీవ్రస్థాయిలో కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దీపావళికి ఒక్క రోజు ముందే అక్కడి గాలిలో విషవాయువులు కలిశాయి. ఢిల్లీకి చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఎన్నిజాగ్రత్తలు చేపట్టినప్పటికీ కాలుష్యంను నిలువరించడంలో విఫలమైంది యంత్రాంగం.
ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాతావరణశాఖ ప్రమాద ఘంటికలు మోగించింది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయిని తాకిందని హెచ్చరించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 470 పాయింట్లను తాకింది. ఢిల్లీలో సరాసరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 449 ఉండగా చాందినీ చౌక్లో 437 పాయింట్లుగా నమోదవగా...విమానాశ్రయం దగ్గర దీని తీవ్రత 396 పాయింట్లుగా ఉంది. ఇక ఢిల్లీ యూనివర్శిటీ ప్రాంతంలో గాలిలో కాలుష్యం తీవ్రత 470గా ఉంది. ఢిల్లీ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ దీపావళికి బాణాసంచ కాల్చకుండా ఉంటే బాగుంటుందని పలు పర్యావరణ సంస్థలు పిలుపునిస్తున్నాయి.
మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం వరకు ప్రజలు బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. గాలిలో ప్రమాదకర వాయువులు తీవ్రస్థాయిలో ఉన్నందున ఆరోగ్యం దృష్ట్యా బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల మధ్య కాలుష్యం కాస్త తగ్గుముఖం పడుతుందని ఆ సమయంలో బయటికి వస్తే బాగుంటుందని సఫర్ కేంద్రం తెలిపింది. ఇక ఢిల్లీ వాతావరణ విషయానికొస్తే పగలు ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ ఉండగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్గా ఉండి చలి ఎక్కువగా పెట్టే అవకాశం ఉందన్నారు. ఇక 1.2 కిలోమీటర్ల మేరకే విజిబులిటీ ఉంటుందని అధికారులు తెలిపారు.
దీపావళి పండగ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని దీంతో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాహనాల నుంచి విడుదలయ్యే పొగ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని చెప్పారు.