ఢిల్లీలో ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్... తీవ్రమైన వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యకోరల్లో చిక్కుకుంది. కాలుష్యం తీవ్రమవడంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రోజు నుంచి డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించింది. ఇప్పటికే అక్టోబర్ తొలి రెండువారాల్లో తొమ్మిది రోజులు ఢిల్లీ నగరాన్ని విపరీతమైన కాలుష్యం కమ్మేసింది. 2017లో ఇలా తొలిసారిగా ఎమర్జెన్సీ ప్రణాళికను అమలు చేసిన ప్రభుత్వం మళ్లీ ఈ సారి కూడా అలాంటి గ్రేడెడె రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తోంది. ఈ ప్రణాళిక అక్టోబర్ 15న ప్రారంభమై మార్చి 2019 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఇక ప్రణాళిక అమల్లోకి రావడంతో ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించడం జరిగింది. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో మాత్రం దీనికి మినహాయింపునిచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ విద్యుత్ సమస్యలు ఉన్నాయి. ఇందుకోసమే డీజిల్ జనరేటర్లు వినియోగంపై అక్కడ నిషేధం విధించలేదని సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ బోర్డు సభ్యురాలు సునీత నారాయణ్ వెల్లడించారు. ఒక వేళ గాలిలో కాలుష్యం మరింత తీవ్రతరం దాలిస్తే కాలుష్యానికి కారణమవుతున్న వాటిపై మళ్లీ నిషేధం విధిస్తామని వెల్లడించారు. ఇందులో స్టోన్ క్రషర్, హాట్ మిక్స్ ప్లాంట్స్, వాహనాల బేసి సంఖ్య విధానంను తిరిగి ప్రవేశ పెట్టడంలాంటివి చేస్తామని సునీత నారాయణ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఢిల్లీ నగరాన్ని చలి వణికిస్తోంది. చలితో పాటు గాలిలో కాలుష్యం తీవ్రత కూడా పెరుగుతూ వస్తోంది. ఆదివారం గాలిలో కాలుష్యం 204గా నమోదైంది. సున్నా నుంచి ఐదువందల పాయింట్లను పరిగణలోకి తీసుకుంటారు. గతేడాది నవంబర్లో 486 పాయింట్లు తాకిన నేపథ్యంలో ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. గాలిలో కాలుష్య తీవ్రత 0 నుంచి 50 మధ్య ఉంటే ఎలాంటి ప్రమాదం లేదని సూచిస్తుంది. 51-100 మధ్య ఉంటే పర్వాలేదు అని అర్థం. 101-200 మధ్య ఉంటే మధ్యంతరంగా ఉన్నట్లు లెక్క. ఇక 201-300 ఉంటే ప్రమాదమని అర్థం. 301-400 మధ్య ఉంటే ప్రమాద స్థాయి పెరుగుతుందని అర్థం. ఇదిలా ఉంటే బొగ్గు వినియోగాన్ని ఢిల్లీలో ఈ ఏడాది జూలై నుంచి నిషేధం విధించారు.