మానవబాంబు అంటూ..మహిళ వీరంగం: 36 వేల అడుగుల ఎత్తున విమానంలో...
కోల్కత: భూమికి సుమారు 36 వేల అడుగుల ఎత్తులో వెళ్తోన్న విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు వికృత రూపాన్ని ప్రదర్శించారు. తాను మానవబాంబునంటూ బెదిరించారు. తనను పేల్చేసుకుంటానంటూ భయోత్పాతాన్ని సృష్టించారు. ఫలితంగా- ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సగం దూరానికి వెళ్లిన విమానం.. చివరికి వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.
మద్యం మత్తులో..
ఈ ఘటనపై పౌర విమానయాతన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు ప్రధాన కారణం ఆమె మద్యం మత్తులో ఉండటమేనని తేలింది. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్కతలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మానవ బాంబునంటూ నోట్..
కోల్కతలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 9:57 నిమిషాలకు 114 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబైకి బయలుదేరింది ఎయిర్ ఆసియా విమానం. విమానం టేకాఫ్ తీసుకున్న సుమారు 20 నిమిషాల తరువాత.. ఓ మహిళా ప్రయాణికురాలు తన డ్రామకు తెర తీశారు. తొలుత- పైలెట్కు అందజేయాలంటూ ఆమె ఓ నోట్ను విమానం సిబ్బందికి అందజేశారు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ వారు ఆమెను నచ్చజెప్పారు.
నడుముకు బెల్ట్ బాంబు..
కొద్దిసేపటి తరువాత ఆమె తానే స్వయంగా కాక్పిట్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. దీనితో ఆమెను అడ్డుకున్న సిబ్బంది.. ఆ నోట్ను అందుకున్నారు. తాను మానవబాంబునని, తాను బెల్ట్ బాంబును ధరించానని, ఏ క్షణంలోనైనా దాన్ని పేల్చేస్తానని రాసి ఉంది అందులో. అది చదవిన వెంటనే సిబ్బందికి చెమటలు పట్టాయి. ఈ విషయాన్ని వారు పైలెట్కు తెలియజేయగా.. ఆయన వెంటనే కోల్కత విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని సంప్రదించారు.
అదుపులో మహిళ
ఏటీసీ అనుమతి ఇవ్వడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. రాత్రి 11:46 నిమిషాలకు విమానం కోల్కత విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సిబ్బంది ఆమెను విమానాశ్రయం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఆ సమయంలో ఆమె మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు పేర్కొన్నారు.