వాంతులు, గందరగోళం: ప్రయాణీకులను ముప్పుతిప్పలు పెట్టిన ఎయిర్ఏసియా పైలట్ (వీడియో)
Recommended Video
కోల్కతా: ఎయిర్ ఏషియాకు చెందిన విమాన సిబ్బంది తమతో అనుచితంగా ప్రవర్తించారని, ఈ కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ప్రయాణీకుల్లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ దీపాంకర్ రాయ్ కూడా ఉన్నారు. ఆయన ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేసి, విమానయాన సంస్థపై ఆగ్రహించారు.
కోల్కతా నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే విమానం నాలుగు గంటల పాటు ప్రయాణీకులను ముప్పు తిప్పలు పెట్టింది. ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లవలసిన విమానం మొదట అరగంట, ఆ తర్వాత గంటన్నర ఆలస్యమవుతుందని చెప్పారని, తమకు ఆహారం, నీరు లేకుండా వదిలేశారని పేర్కొన్నారు.
కాసేపటికి విమానం కెప్టెన్ ప్రయాణీకులందర్నీ కిందకు దిగమని సూచించారని, బయట వర్షం పడుతున్నందున నిరాకరించారని, దీంతో అతను అతనితో వాగ్వాదం జరిగిందని తెలిపారు. అందరూ దిగిపోవాలనే ఉద్దేశ్యంతో అతను విమానంలోని ఏసీని బాగా పెంచారని, దీంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు.
కొందరు మహిళా ప్రయాణీకులు వాంతులు చేసుకున్నారని, పిల్లలు ఏడ్చారని, విమానం లోపల పొగమంచులా ఏర్పడిందని, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. విమానం దిగిన తర్వాత ఫుడ్ కోర్టుకు వెళ్తే అక్కడ ఏమీ లేవని, ప్రయాణీకులే కొనుగోలు చేశారని దీపాంకర్ తెలిపారు.
కాగా, దీనిపై ఎయిర్ ఏషియా స్పందించింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఈ విమానం 4 గంటల పాటు ఆలస్యమైందని పేర్కొన్నారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఎక్కువ తేమ ఉన్నప్పుడు విమానంలో ఏసీ ఆపరేట్ చేస్తే అలాగే ఉంటుందని తెలిపింది.