కార్తి చిదంబరంపై ఈడీ ఛార్జీషీటు, మరో నలుగురి పేర్లు చేర్చిన దర్యాఫ్తు సంస్థ
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ - మాక్సిస్ కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్తి చిదంబరం, తదితరులపై ఛార్జీషీటు దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వారిపై ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఈ ఛార్జీషీట్ దాఖలు చేసింది.
న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4 కింద కార్తి చిదంబరంతో పాటు మరో నలుగురు పేర్లను ఈడీ చేర్చింది. పలుమార్లు మాజీ కేంద్రమంత్రి చిదంబరం పేరు చేర్చినా, అతడిని మాత్రం నిందితుడిగా పేర్కొనలేదు.
దీనికి అనుబంధ ఛార్జీషీటును కూడా దాఖలు చేస్తానని ఈడీ న్యాయస్థానానికి వెల్లడించింది. 2జీ స్పెక్ట్రమ్ స్కాం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎయిర్ సెల్- మ్యాక్సిస్ మనీ లాండరింగ్ బయటపడింది. దాంతో 2010, 2011లో కార్తి చిదంబరంపై సీబీఐ, ఈడీ ఫైల్ చేసిన కేసులకు సంబంధించి అతడిని అరెస్టు చేయకుండా కోర్టు జులై 10 వరకు తాత్కాలిక రక్షణను పొడిగించింది.