ఎయిర్ సెల్-మ్యాక్సిస్ : చిదంబరానికి ముందస్తు బెయిల్ పై ఈడీ ఛాలెంజ్: రద్దు చేయాలంటూ పిటీషన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని మరింత చిక్కుల్లో నెట్టే దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అడుగులు వేశారు. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి కింది కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు. ముందస్తు బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేస్ అప్డేట్స్: బెయిల్ కోసం సుప్రీం తలపులు తట్టిన చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్టు చేయడానికి కొన్ని గంటల ముందే ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడికి దిగువ న్యాయస్థానం కిందటి నెల 5వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అరెస్ట్ అయ్యే అవకాశం తప్పినందుకు ఊపిరి పీల్చుకోక ముందే- ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ దొరికిన రోజే.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులకు స్థానిక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అంతే. అప్పటి నుంచీ ఆయన సీబీఐ అధికారుల కస్టడీలోనే ఉన్నారు. తీహార్ జైలును కేంద్రంగా చేసుకుని సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. రెండు సార్లు ఆయన కస్టడీని సైతం పొడిగించింది ఢిల్లీ న్యాయస్థానం.
తాజాగా- చిదంబరానికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం, దిగువ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరడ.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో బెయిల్ రద్దయితే.. ఇక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణను చిదంబరం, ఆయన కుమారుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కార్తి చిదంబరం బెయిల్ పై ఉన్నారు. ఆయనను కూడా తీహార్ జైలుకు తరలించవచ్చని తెలుస్తోంది.