చెప్పుతో కొడతా!: ఎయిర్ హోస్టెస్తో ఎంపీ అనుచితంగా, తిట్లు(వీడియో)
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు పప్పూ యాదవ్ ఓ విమానంలోని ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. పాట్నా నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది.
తినగా మిగిలిన ఆహారాన్ని నడిచే దారిలో వేయవద్దని చెప్పినందుకు పప్పూ యాదవ్ తన పైన తిట్ల దండకం అందుకున్నాడని ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది. సర్ది చెప్పబోయిన కేబిన్ క్రూ పైన చిందులు తొక్కాడని పేర్కొన్నారు. చెప్పుతో కొడతానని కూడా పప్పూ యాదవ్ బెదిరించినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై ఫ్లయిట్ కెప్టెన్ ఢిల్లీ విమానాశ్రయానికి రిపోర్ట్ చేశాడు. విమానంలో ఓ అతిథి ఇబ్బంది పెడుతున్నాడని, సెక్యూరిటీ కావాలని కోరాడని తెలుస్తోంది.
విమానం ఆగగానే భద్రతా సిబ్బంది వచ్చి పప్పూ యాదవ్ను తీసుకు వెళ్లారు. కాగా, తన పైన రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని పప్పూ చెప్పడం గమనార్హం. ఆర్జేడీ తరఫున ఎంపీగా గెలిచిన పప్పూ పైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో మే నెలలో పార్టీ బహిష్కరించింది.