ఎయిరిండియాకు భారీ జరిమానా... ఒకటి వడ్డించబోయి మరొకటి వడ్డించారు
అసలే కష్టాల ఊబిలో కూరుకుపోతున్న ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు సిబ్బంది రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది. ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి శాఖాహారం ఇవ్వబోయి మాంసాహారం వడ్డించి చిక్కుల్లో పడింది. మరి మాంసాహారం సర్వ్ చేసినందుకు ఆ ప్రయాణికుడు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దీంతో ఎయిరిండియా సంస్థకు జరిమానా విధించడం జరిగింది.
వెజిటేరియన్ బదులు నాన్ వెజ్..
పంజాబ్ స్టేట్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ ఎయిరిండియాలో ప్రయాణించిన ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఆ సంస్థకు జరిమానా విధించింది. మొహలీకి చెందిన చంద్రమోహన్ పాతక్ దంపతులకు ఎయిరిండియా సిబ్బంది వెజిటేరియన్కు బదులు నాన్వెజ్ వడ్డించారు. దీంతో సీరియస్ అయ్యారు చంద్రమోహన్. సిబ్బందిపై గట్టిగా అరిచాడు. పొరపాటు జరింగిందని సిబ్బంది చెప్పినప్పటికీ చంద్రమోహన్ పాతక్ శాంతించలేదు.
వెజిటేరియన్ అని స్పష్టంగా చెప్పారు
జూన్ 17, 2016న చంద్రమోహన్ న్యూఢిల్లీ నుంచి షికాగోకు ఎయిరిండియాలో రెండు టికెట్లు బుక్ చేసుకున్నాడు. అదే ఏడాది నవంబర్ 14కు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే తను తన భార్య ఇద్దరికీ శాఖాహారమే కావాలని టికెట్ బుక్ చేసుకునే సమయంలో స్పష్టంగా మెన్షన్ చేసినట్లు చెప్పాడు. అయితే న్యూఢిల్లీ నుంచి షికాగోకు వెళ్లే సమయంలో తమకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అయితే తిరిగి షికాగో నుంచి న్యూఢిల్లీకి వచ్చే సమయంలో మాత్రం తమకు నాన్వెజ్ సర్వ్ చేశారని చెప్పాడు.
డిస్ట్రిక్ట్ ఫోరం కోర్టు విధించింది రూ.17వేలు
విషయం క్యాబిన్ సిబ్బంది దృష్టికి తీసుకురాగా నాన్వెజ్ మరియు వెజిటేరియన్ ప్యాకెట్స్ను గుర్తు పట్టేందుకు ఎలాంటి గుర్తులు వేయలేదని తెలిపారు. ఇక వెంటనే ఫిర్యాదు చేసేందుకు రిజిస్టర్ ఇవ్వమని కోరగా విమానంలో అది లేదని చెప్పాడు. ఢిల్లీలో ల్యాండ్ అవగానే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.చంద్రమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో కన్స్యూమర్ ఫోరం చర్యలు తీసుకుంది. ముందుగా రూ.10వేలు ఎయిరిండియా సంస్థకు జరిమానా విధించింది. అంతేకాదు లీగల్ ఖర్చుల కింద రూ.7వేలు చెల్లించాలని నోటీసులు పంపింది.
కమిషనరేట్లో సవాల్ చేసిన ఎయిరిండియా
ఇదే విషయాన్ని సవాలు చేస్తూ ఎయిరిండియా స్టేట్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్లో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణ చేసిన కమిషన్ ఎయిరిండియాకు షాకిస్తూ చంద్రమోహన్కు డిస్ట్రిక్ కన్స్యూమర్ ఫోరం విధించిన రూ.10వేల జరిమానాను నాలుగురెట్లకు పెంచుతూ రూ.40వేలు కట్టాల్సిందిగా ఆదేశించింది. వెజిటేరియన్ ఆహారంకు బదులు నాన్వెజ్ వడ్డించి ఎయిర్లైన్స్ పెద్ద పాపం చేసిందని కమిషన్ భావించింది. ఇలా వడ్డించి ప్రయాణికుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా... వారి మతపరమైన భావాలను కూడా అవమానించిందని కమిషన్ పేర్కొంది. ఆదేశాలు కలిగిన కాపీని అందుకున్న నెల రోజుల సమయంలో మొత్తం రూ.47 వేలు కమిషన్లో చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.