తప్పిన పెను ప్రమాదం: టేకాఫ్ సమయంలో రన్వేపైకి జీపు... ధ్వంసమైన ఎయిరిండియా విమానం
పూణే: పూణే విమానాశ్రయంలో ఎయిరిండియా విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి టేకాఫ్ తీసుకునే సందర్భంలో హఠాత్తుగా ఓ జీపు రన్వేపైకి దూసుకురావడంతో దాన్ని తప్పించేందుకు పైలట్ సడెన్గా విమానంను పైకి లేపారు. దీంతో విమానంలోని ప్రధాన భాగం దెబ్బతింది. ఎయిరిండియా విమానం ఏ321 పూణే విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయలుదేరింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా పైలట్ విమానంను అలానే తీసుకెళ్లి నేరుగా ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
రన్వేపై నుంచి 120 నాట్ల వేగంతో పైలట్ విమానంను తీసుకెళుతుండగా ఒక్కసారిగా రన్వేపై ఒక జీపు మరోవ్యక్తి రావడంతో విమానం టేకాఫ్ తీసుకునే సాధారణ సమయంకంటే ముందుగానే గాల్లోకి లేవడంతో ఈ ప్రమాదం జరిగిందని డీజీసీఏ వెల్లడించింది. ఇదిలా ఉంటే అసలు ఘటనకు ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు కాక్పిట్లోని వాయిస్ రికార్డర్ను తొలగించి సబ్మిట్ చేయాల్సిందిగా అధికారులు కోరారు.
ఇక విమాన ఘటనపై విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ విమానం సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు పూణే ఏటీసీతో కూడా సమన్వయం చేసుకుని జరిగిన ఘటనపై నివేదిక అందజేయాలని సంస్థ కోరింది. అంతేకాదు రన్వేపై మార్కింగ్లను కూడా పరిశీలించాలని సూచించింది.
పూణే నుంచి శ్రీనగర్కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఏ 321కు ప్రమాదం జరగడంతో ఓ భాగం ధ్వంసమైందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. పూణే నుంచి ఈ విమానం ఢిల్లీకి వచ్చిందని వెల్లడించారు. ఇక ఈ విమానం సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు ఆ ప్రతినిధి. అంతేకాదు కాక్పిట్ వాయిస్ రికార్డర్, మరియు సాలిడ్ స్టేట్ ఫ్లైట్ డేటా రికార్డర్లను పరిశీలించిన తర్వాత ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలుపుతామని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు.