జర్మన్ వింగ్స్ కోపైలట్ ఎఫెక్ట్: భారత్లో పైలట్లకు టెస్ట్లపై తర్జన
న్యూఢిల్లీ: భారత దేశంలో పైలట్లు, కో పైలట్ల మానసిక స్థితి పైన మందుగా పరీక్షించేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జర్మన్ వింగ్స్ విమానం ఎయిర్బస్ ఏ320 కూలడానికి కో-పైలట్ ల్యూబిడ్జ్ మానసిక స్థితి సరిగా లేకపోవడమే కారణమన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పైలట్లు, కో పైలట్ల మానసిక స్థితిగతుల విషయంలో మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వందలాది మందితో గాల్లో ఎగిరే విమానాన్ని సక్రమంగా, సవ్యంగా గమ్యానికి చేర్చే మానసిక స్థితి పైలట్లకు ఉందో లేదో నిర్థారించుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దేశంలోని వాణిజ్య విమానాల్లో వేలాది మంది పైలట్లు పని చేస్తున్నారు. వీరిని ఉద్యోగంలో తీసుకునే సమయంలో మానసిక స్థితిగతులకు సంబంధించిన పరీక్షిస్తున్నారు. అయితే, ప్రతి ఆర్నెల్లకోసారి శారీరక ఫిట్నెస్కు సంబంధించి మాత్రం వీరు పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే, నిర్ణీత కాల వ్యవధిలో పైలట్లకు మానసిక స్థిరత్వానికి సంబంధించిన పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర పౌరయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ సోమవారం చెప్పారు. ఇందుకు సంబంధించి సమగ్ర చర్చ జరిపిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.