"ఆపరేషన్ కరోనా వ్యాక్సిన్"కు సిద్దమవుతున్న ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టులు- భారీ యజ్ఞం
కరోనాలో విలవిల్లాడుతున్న దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం తాజాగా వ్యాక్సిన్పై ప్రకటన చేసింది. మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. వ్యాక్సిన్ రాగానే ముందుగు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపైనా భారీ కసరత్తు సాగుతోంది. అలాగే వ్యాక్సిన్ పంపిణీ కోసం కూడా దేశవ్యాప్తంగా భారీ యజ్ఞమే సాగుతోంది.
"ఆపరేషన్ కరోనా వ్యాక్సిన్" పేరుతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలంటే భారీ కసరత్తు అవసరమవుతోంది. ఇందు కోసం ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరక రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు పూర్తయింది. ఈ కమిటీల సాయంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే క్రమంలో వ్యాక్సిన్ను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా విమానయాన సంస్ధలు, విమానాశ్రయాలు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఆక్స్ఫర్డ్ టీకా పిఫిజిర్ రాగానే దేశవ్యాప్తంగా శరవేగంగా దాన్ని పంపిణీ చేసి రోగులకు అందించాల్సి ఉంటుంది. ఇందులో ఆలస్యమైతే టీకా వికటించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే టీకాను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేయడంతో పాటు దీన్ని వివిధ ప్రాంతాలకు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీకాను కోల్డ్ స్టోరేజీలతో పాటు విమానాల్లో పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విమానయాన సంస్దలతో పాటు విమానాశ్రయాలు నడుపుతున్న ఆపరేటర్లు కూడా ఈ భారీ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు.
హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు నడుపుతున్న జీఎంఆర్ సంస్ధ ఈ ప్రక్రియలో కీలకమవుతోంది. ఇప్పటికే జీఎంఆర్ ప్రత్యేక కార్గో యూనిట్లను సిద్ధం చేయడంతో పాటు వీటిలో ప్లస్ 25 డిగ్రీల నుంచి మైనస్ 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ క్యారియర్గా ఉన్న స్పైస్ జెట్ యొక్క కార్గో విభాగంతో పాటు స్పైస్ ఎక్స్ప్రెస్ కూడా ఇందులో భాగస్వాములవుతున్నాయి.
వీరిద్దరూ కలిసి గ్లోబల్ కోల్డ్ చైన్ సంస్ధతో భాగస్వాములై ఈ వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 25 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ కోల్డ్ చైన్ నిర్వహించిన అనుభవం ఈ సంస్ధకు ఉంది. దేశంలోని మిగతా ఎయిర్పోర్టులు, ఎయిర్లైన్ సంస్ధలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నాయి.