ప్రచ్ఛన్నయుద్ధం: చైనాయులకు భారత్లో నో ఎంట్రీ: విమానం ఎక్కితే..అంతే: కేంద్రం కఠిన ఆదేశాలు?
న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనాపై భారత్ ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు కారణం కావడంతో పాటు ఈ విషయంపై ప్రపంచ దేశాలను ముందే హెచ్చరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన చైనా పాలకులపై ఇప్పటికే వ్యతిరేకత ఎదురవుతోంది. దీనికి తోడు- లఢక్ వద్ద వాస్తవాధీన రేఖ వ్యవహారాన్ని యుద్ధం వరకు తీసుకెళ్లడం, వేల సంఖ్యలో సైనికులను మోహరింపజేయడం, భారత సైన్యంపై దాడులకు పాల్పడటం వంటి చర్యలతో మరింత చెడ్డపేరును తెచ్చుకుంది చైనా. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త కరోనా స్ట్రెయిన్: గగుర్పాటు కలిగించే నిజం: భారత్లోనే: పరిణామక్రమం..విస్తరణ
చైనీయులు భారత్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భారత్కు చెందిన విమానాల్లో చైనీయులకు ప్రవేశం కల్పించకుండా నిషేధం విధించిందని అంటున్నారు. ఈ మేరకు అన్ని పౌర విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం.. సూచనప్రాయంగా ఆదేశాలను జారీ చేసిందనే ప్రచారం దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది. ప్రముఖ జాతీయ న్యూస్ పోర్టల్ ఇండియా టుడే దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం దీనికి కారణమైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్డౌన్ అనంతరం చైనాకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఫలితంగా- చివరి మూడునెలల కాలంలో రోజుల స్వల్ప వ్యవధిలో భారీ సంఖ్యలో చైనీయులు భారత్కు రాకపోకలు సాగించినట్లు సమాచారం. పర్యాటకానికి సంబంధించినవి మినహా కొన్ని రకాల విసాలపై తరచూ చైనీయులు భారతకు వస్తూ, పోతున్నట్లు గుర్తించింది. ఎయిర్ బబుల్ విధానం కింద కొన్ని దేశాలకు మాత్రమే పరిమితంగా కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులను పునరుద్ధరించింది. దీనికోసం కొన్ని నిర్దుష్టమైన మార్గదర్శకాలు, ప్రొటోకాల్ను రూపొందించింది. ఈ మార్గదర్శకాలకు లోబడి చైనీయులు కూడా భారత్కు రాకపోకలు సాగించవచ్చు. చైనీయులు దీన్ని ఉల్లంఘిస్తున్నట్లు కేంద్రం భావిస్తోందని ఆ కథనం పేర్కొంది.
తమ దేశంలో భారతీయుల ప్రవేశంపై చైనా అధికారులు ఇదివరకే ఆంక్షలు విధించారు. నవంబర్ 5వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు వెళ్లాలనుకునే భారతీయులు తప్పనిసరిగా హెల్త్ డిక్లరేషన్ను అందజేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్పై చైనా ఎంబసీ లేదా కాన్సులేట్ అధికారులు స్టాంప్ను వేస్తేనే ఆ దేశానికి ప్రయాణం కావడానికి అనుమతి లభిస్తుంది. కిందటి నెల 5వ తేదీ నుంచి ఈ హెల్త్ డిక్లరేషన్కు అనుమతులను నిలిపివేసింది. దీనికి ప్రతీకారంగా భారత్ సైతం చైనా విధానాలనే అనుసరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.