విమానం హైజాక్?? వెంటాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు?
భారత గగనతలంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. మన గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంత సమయం కలకలం రేకెత్తింది. అధికారులు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకొని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఫైటర్ జెట్లు, అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు.
ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంఘ్జుకు వెళ్తున్న మహన్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉన్నట్లు లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) సిబ్బందికి ఫోన్ వచ్చింది. వారు వెంటనే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందజేశారు. అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ అవుతుందని అంచనా వేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లను సిద్ధంగా ఉంచారు. ఏదైనా అనుకోనిది తలెత్తితే అవి వెంటాడేందుకు సిద్ధమయ్యాయి. కొంత సమయం గడిచిన తర్వాత ఆ విమానం ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగడంలేదని తెలిసింది. చండీగఢ్ లో లేదంటే జైపూర్ లో దిగే అవకాశం ఉందని భావించారు. ఈ రెండు నగరాల్లో విమానాన్ని ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్లకు సూచించారు. అయితే వారు నిరాకరించారు. భారత గగనతలం వదిలిపెట్టి చైనా గగనతలంలోకి వెళ్లడంతోపాటు బాంబు బెదిరింపు కాల్ నకిలీదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.