ఎయిర్ ఇండియా ఆఫీస్కు బెదిరింపు కాల్: ఢిల్లీ-కాబూల్ ప్లేన్ను హైజాక్ చేసే ప్రమాదం!
న్యూఢిల్లీ/కోల్కతా: ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రాజధాని కోల్కతాలని ఆ సంస్థ కార్యాలయానికి శనివారం సాయంత్రం అగంతకుడి నుండి బెదిరింపు కాల్ వచ్చింది. అగంతకుడు బెంగాలీలో మాట్లాడాడు.
అతను బెంగాల్ భాషలో రెండు మాటలు క్లుప్తంగా మాట్లాడి పెట్టేశాడని, ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఎయిర్ ఇండియా కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఇటువంటి ఫోన్లు సాధారణమే అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు పకడ్బంధీగా తీసుకుంటున్నామన్నారు.
ఢిల్లీ - కాబూల్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసే ప్రమాదం ఉందని ఎయిర్ ఇండియా విమాన సంస్థకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఐబీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు.
ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. విమానాశ్రయాల వద్ద హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం భద్రతను పెంచింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. గతంలో న్యూఢిల్లీ నుండి ఆప్ఘనిస్తాన్ వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు మళ్లించిన విషయం తెలిసిందే.