జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పై వైమానిక దాడుల అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. సరిహద్దుల్లోని బుడ్గామ్ లో భారత వైమానిక దళానికి చెందిన ఓ చాపర్ కుప్పకూలిన తరువాత పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినట్టయింది. ఈ చాపర్ ను తామే కూల్చేశామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు.
ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు సమీపం గుండా రాకపోకలు సాగించే పౌర విమానాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడవచ్చని కేంద్రం అనుమానించింది. ఫలితంగా- భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలకు దిగింది.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ తక్షణ చర్యల చేపట్టింది. శ్రీనగర్, జమ్మూలకు విమానాల రాకపోకలను నిషేధించింది. ఈ రెండు ప్రధాన నగరాలతో పాటు జమ్మూకాశ్మీర్ లో మారుమూల కొండల్లో ఉన్న లేహ్ పట్టణానికి కూడా విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలియజేసింది.
ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే.. విమానయాన సంస్థలు స్పందించాయి. దేశంలోని వివిధ నగరాల నుంచి శ్రీనగర్, జమ్మూ, లేహ్ లకు బయలుదేరి వెళ్లాల్సిన విమానానలు దారి మళ్లించారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి నగరాలకు విమానాలకు దారి మళ్లించారు. అక్కడి నుంచి ప్రయాణికులను రోడ్డు మార్గంలో శ్రీనగర్, లేహ్, జమ్మూలకు తరలిస్తామని విమానయాన సంస్థలు వెల్లడించాయి.
త్వరలో చండీగఢ్, అమృత్ సర్ లకు కూడా..
పౌర విమానాల రాకపోకలపై విధించిన నిషేధం మరిన్ని నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న అమృత్ సర్ సహా చండీగఢ్ నగరానికి కూడా విమానాల రాకపోకలను నిషేధించ వచ్చని సమాచారం.