వినియోగదారులకు మరోసారి షాకిచ్చిన ఎయిర్టెల్: ఇక కనీస రీఛార్జీ ‘డబుల్’ చేసుకోవాల్సిందే!
ప్రముఖ భారత టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరోసారి తమ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. ఇక నుంచి ప్రీపెయిడ్ కనీస రీఛార్జీ మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసేసింది. ఇప్పటి వరకు రూ. 23గా ఉన్న మొత్తాన్ని రూ. 45 చేసింది.
ఎలాంటి అవాంతరాలు లేని ఎయిర్టెల్ సేవలు పొందాలంటే వినియోగదారులు నెలకు రూ. 23కు బదులు రూ. 45తో రీఛార్జీ చేయించుకోవాల్సి ఉంటుంది. పెంచిన కనీస రీఛార్జీ మొత్తాన్ని ఆదివారం నుంచి అమలు చేస్తున్నామని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక నుంచి ఎయిర్టెల్ వినియోగదారులు 28 రోజులకు రూ. 23కు బదులు రూ. 45తో రీఛార్జీ చేసుకోవాల్సిందే. ఈ రీఛార్జీతో ఎలాంటి డేటా, ఉచిత కాల్స్ లభించవు. అంతేగాక, రూ. 45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జీ చేసుకోకుంటే గత ప్లాన్ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత సేవలను నిలిపివేస్తామని ఎయిర్టెల్ కంపెనీ తేల్చి చెప్పింది.
ఇప్పటికే ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్స్ను దాదాపు 50శాతం మేర పెంచిన ఎయిర్టెల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ కనీస రీఛార్జీ మొత్తాన్ని దాదాపు రెట్టింపు పెంచి వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. వరుసగా టెలికాం కంపెనీలన్నీ ఛార్జీలను పెంచుతూ పోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు రీఛార్జీ మొత్తాలను తగ్గించుకుంటున్నారు. డేటా వినియోగాన్ని కూడా తగ్గించుకుంటున్నారు.