కాల్ డ్రాప్స్: రిలయన్స్, ఎయిర్టెల్ మధ్య మాటల పోరు
న్యూఢిల్లీ: దేశంలోని రెండు టెలికమ్ ఆపరేటర్లు ఎయిర్టెల్-రిలయన్స్ జియో మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇస్తామని చెప్పిన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) కూడా ఇవ్వకుండా ఎయిర్టెల్ మోసం చేసిందని రిలయన్స్ జియో ఆరోపించింది.
దీంతో తమ నెట్వర్క్లో రోజూ రెండు కోట్లకు పైగా కాల్ డ్రాప్స్ నమోదవుతున్నట్టు చెప్పింది. నంబర్ పోర్టబులిటీ కింద ఎయిర్టెల్ నుంచి రిలయన్స్ జియో నెట్వర్క్కు మారే వినియోగదారులకు ఎయిర్టెల్ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించింది.
వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే ట్రాయ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జియో ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. తమ రెండు నెట్వర్క్ల మధ్య కాల్స్ పూర్తయ్యేందుకు అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్లో నాలుగో వంతు మాత్రమే ప్రస్తుతం ఎయిర్టెల్ తమ నెట్వర్క్ కోసం ఇచ్చిందని తెలిపింది.
ఈ పాయింట్లతో ఖాతాదారులకు నాణ్యమైన ఉచిత వాయిస్ కాల్స్ అందించడం సమస్యగా మారిందని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీని నీరుగార్చేలా ఎయిర్టెల్ ప్రవర్తిస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది.
దీనివల్ల జియో వినియోగదారులు ఉచితంగా నాణ్యమైన వాయిస్ సేవలు అందుకోవడం సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ టైమ్ కంటే ముందుగానే రిలయన్స్ జియో కోసం మరిన్ని పిఒఐలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించిన రెండో రోజే రిలయన్స్ జియో ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
తోసిపుచ్చిన ఎయిర్టెల్
ఎయిర్టెల్ మాత్రం రిలయన్స్ జియో ఆరోపణలను తోసిపుచ్చింది. జియో అవసరాల కంటే ఎక్కువ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లే ఇచ్చామని తెలిపింది. ఈ నెల 13నే అంతకు ముందున్న పాయింట్ల కంటే మూడింతలు పెంచినట్టు తెలిపింది.
పెంచిన ఈ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లతో రిలయన్స్ జియో 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులకు కాల్ డ్రాప్స్ లేకుండా వాయిస్ సేవలు అందించ వచ్చని తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ జియోకు ఉన్న 10 కోట్ల ఖాతాదారుల అవసరాల కన్నా ఇవి ఎక్కువేనని గుర్తు చేసింది. ఈ విషయాలేవీ గమనించకుండా రిలయన్స్ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. జియో టెక్నాలజీలోనే లోపం ఉండవచ్చని అభిప్రాయపడింది.
బహుశా వోల్ట్ టెక్నాలజీకి సంబంధించిన యంత్రాంగం ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చని తెలిపింది. ఈ విషయాలను కప్పిపెట్టుకునేందుకే రిలయన్స్ జియో తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.