ఐశ్వర్యరాయ్తో తేజ్ప్రతాప్ నిశ్చితార్ధం, 200 మంది అతిథులు
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ప్రతాప్ యాదవ్కు, ఐశ్వర్యరాయ్కు బుధవారం నాడు నిశ్చితార్ధం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని మౌర్య హోటల్లో వీరిద్దరి నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పశుదాణా కుంభకోణంలో జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. దీంతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాలేకపోయాడు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ప్రతాప్, ఐశ్వర్యరాయ్లు రింగులు మార్చుకొన్నారు. నిశ్చితార్ధం కోసం ముఖ్యమైన 200 మంది అతిథులను లాలూ కుటుంబం ఆహ్వానించింది. ఈ నిశ్చితార్ధం కోసం మౌర్య హోటల్ను ప్రత్యేకంగా అలంకరించారు.
దేశంలోని పూణె, బెంగుళూరు, కోల్కత్తా, ఢిల్లీల నుండి తెచ్చిన ప్రత్యేక పుష్పాలతో హోటల్ను అలంకరించారు. పలువురు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 12వ తేదిన పాట్నాలోని వెటర్నరీ కాలేజీ కాంపౌండ్లో తేజ్ ప్రతాప్, ఐశ్వర్యరాయ్ వివాహం జరగనుంది.
వీరిద్దరి వివాహా నిశ్చితార్ధానికి లాలూ సోదరీమణులు పాట్నాకు వచ్చారు.తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం చేసుకోబోతున్న ఐశ్వర్యరాయ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ధరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికారాయ్ బీహార్ మంత్రిగా పనిచేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదివిన ఐశ్వర్యరాయ్ ఢిల్లీలో ఉన్నతవిద్యను అభ్యసించారు.