ఇదేం ప్రవర్తన!: పనామాపై ప్రశ్న, ఐశ్వర్యకు చిర్రెత్తుకొచ్చింది
ముంబై: ఇటీవల పనామా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.
పనామా పత్రాల్లో తన పేరు ఉండటాన్ని పాత్రికేయులు ప్రశ్నించగా ఐశ్వర్య రాయ్ అసహనం ప్రదర్శిచారు. ఇందులో మీకు ఎందుకంత ఉత్సాహం అని మండిపడ్డారు. అయితే, ఐశ్వర్య ప్రవర్తన పైన విమర్శలు వస్తున్నాయి.
ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, రణదీప్ హుడా నటిచిన బయోపిక్ సరబ్ జిత్ ట్రయలర్ విడుదల సందర్భంగా ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు పనామా పత్రాల్లో ఆమె పేరు ఉండటంపై ప్రశ్నలు కురిపించారు.
ఈ సందర్భంగా ఆమె మౌనం వహించింది. అక్కడే ఉన్న హీరో రణదీప్ హుడా జోక్యం చేసుకొని ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. కేవలం సినిమాకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించాలని కోరారు. అయినా ఓ జర్నలిస్ట్ విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై ప్రశ్నించాడు.
దీంతో ఐశ్వర్యకు చిర్రెత్తుకొచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము ఓ ప్రకటన చేశామని, అది మీ అందరికీ తెలుసునని, మీరు ఒక్కరే అడుగుతున్నారని మండిపడ్డారు. ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని సదరు విలేకరిని ప్రశ్నించారు. ఓ ప్రకటన ఇచ్చామని, దానిని చూసుకోవాలని ఆమె మేనేజర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.