కుమారుడి పట్టాభిషేకం.. కళ్లారా చూసేందుకు... జైలు నుంచి వచ్చిన తండ్రి.. పెరోల్పై వివాదం
హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవీ దుష్యంత్ చౌతాలా చేపట్టనున్నారు. దీంతో జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్ చౌతాలా పెరోల్ మీద బయటకొచ్చారు. రెండువారాల తర్వాత ఆయన తిరిగి జైలుకు వెళ్లనున్నారు.
కింగ్మేకర్
జేజేపీని దుష్యంత్ చౌతాలా 11 నెలల క్రితం ఏర్పాటుచేశారు. కానీ ప్రజల మన్ననలు పొందారు. 10 సీట్లు సాధించి కింగ్ మేకర్గా అవతరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్తో జట్టుకట్టామనే ఊహాగానాలు వినిపించాయి. దీంతో బీజేపీ అలర్టై.. ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. దీంతో తన ఉనికి లేకుండా పోతామని భావించి.. బీజేపీ ప్రభుత్వలో చేరతామని దుష్యంత్ ప్రకటించారు. దీంతో బీజేపీ-జేజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతుంది.
అక్రమ నియమాకాలు
అజయ్ చౌతాలా తీహర్ జైలులో ఉన్నారు. 2013లో టీచర్లను అక్రమంగా నియమించారనే అభియోగాలతో జైలులో ఉన్నారు. దాదాపు 3 వేల మంది టీచర్ల అక్రమంగా రిక్రూట్ చేశారని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అజయ్ చౌతాలా తండ్రి ఓం ప్రకాశ్ చౌతాలా కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయుల ఎంపికలో వారిద్దరూ అవకతవకలకు పాల్పడినట్టు నేరాభియోగాలు రుజువయ్యాయి.
పెరోల్పై వివాదం
అజయ్ చౌతాలాకు పెరోల్ ఇచ్చేందుకు ఢిల్లీ సర్కార్ తొలుత నిరాకరించింది. కానీ రెండువారాల పెరోల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై కూడా ఓ వివాదం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం పెరోల్ ఇచ్చేందుకు అంగీకరించలేదని మరో వాదన తెరపైకి వచ్చింది.
డీజీ అనుమతి ఫైనలా..?
వాస్తవానికి తీహర్ జైలు నుంచి విడుదల కావాలంటే డీజీ అనుమతి తప్పనిసరి. డీజీ పర్మిషన్తో అజయ్కు పెరోల్ మంజురైంది. కానీ ఢిల్లీ హోంశాఖ మాత్రం తాము ప్రతిపాదన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో అజయ్ పెరోల్ కోసం ఏ స్థాయిలో ఒత్తిడి జరిగింది అనే అంశంపై సర్వత్రా చర్చానీయాంశమైంది. అజయ్ విడుదలలో కేంద్ర ప్రభుత్వం ప్రభావం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.