ప్రతిభకు పట్టం : జాతీయ భద్రతా సలహాదారునిగా మరో ఐదేళ్లు దోవల్, ఈసారి క్యాబినెట్ హోదా..
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్లో తన మార్క్ చూపించిన ప్రధాని నరేంద్ర మోడీ .. అధికారుల ఎంపికలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. ప్రతిభకు పట్టం కడుతున్నారు. క్యాబినెట్లో జై శంకర్కు చోటు .. మిగతా మంత్రుల ఎంపికను పరిశీలిస్తే తన టీం కోసం మోడీ పెద్ద కసరత్తు చేసినట్టు అర్థమవుతుంది. దీంతోపాటు ప్రభుత్వానికి చెవి, కళ్లు, ముక్కు అయిన జాతీయ భద్రత సలహాదారుడిగా అజిత్ దోవల్ పదవీ మరో ఐదేళ్లు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కీ రోల్ ..
అజిత్ దోవల్ .. సమర్ధమైన అధికారి, 74 ఏళ్ల వయస్సులోనూ దేశ భద్రత కోసం అనునిత్యం పాటుపడుతున్నారు. మోడీ తొలి దఫా ప్రభుత్వంలో కీలక చర్యలు తీసుకోవడంలో దోవల్ మార్క్ కనిపించింది. దోవల్ ప్రతిభకు మెచ్చిన నరేంద్ర మోడీ .. మరో ఐదేళ్లు దోవల్ను కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు దోవల్కు క్యాబినెట్ హోదా ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు జాతీయ భద్రతా సలహాదారునిగా కేంద్రం సహాయ మంత్రి హోదా కల్పించారు. ఇప్పుడు దోవల్ పనితీరు చూసి క్యాబినెట్ ర్యాంకు కల్పిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. మోడీ తొలి క్యాబినెట్లో పనిచేసే ముందు దోవల్ .. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసి.. పదవీ విరమణ చూశారు. నిఘా విభాగ అధిపతిగా మంచి పేరుంది. దీంతో కీలకమైన జాతీయ భద్రతా సలహాదారు పదవీ అప్పగించారు.
దాడికి .. ప్రతి దాడి ...
ప్రధానిగా నరేంద్ర మోడీ తొలి క్యాబినెట్లో భద్రతాపరంగా తీసుకున్న చర్యలు అజిత్ దోవల్ సూచనల ప్రకారమే జరిగాయి. గతంలో మాదిరిగా కాకుండా శత్రువులపై దాడులు చేసి .. మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పాకిస్థాన్కు ధీటుగా బుద్ధిచెప్పడంలో దోవల్ చాణక్యం పనిచేసింది. యురిలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భారత్ ధీటుగా స్పందించింది. వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేసి తాము చూస్తూ ఊరుకోబోమని సంకేతాలు ఇచ్చింది. మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేయడం .. అందులో దోవల్ పాత్ర మరవలేం. అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్తో కలిసి క్షణ క్షణం పరిస్థితిని సమీక్షిస్తూ .. విజయవంతంగా లక్షిత దాడులు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గగనతలం నుంచి మెరుపుదాడి
లక్షిత దాడుల తర్వాత కూడా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరిలో పుల్వామాలో రెచ్చిపోయంది. 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకుంది. దీనికి భారత్ ధీటుగానే స్పందించింది. దాడి చేసి .. వెంటనే తాము బాధ్యత వహిస్తున్నట్టు హిబ్బుల్ ముజాహీద్దిన్ సంస్థ ప్రకటించింది. దీంతో వెంటనే భారత్ ప్రతీకార చర్యకు దిగింది. పాకిస్థాన్లోని బాలాకోట్లో గల హిబ్బుల్ ముజాహీద్దిన్కు చెందిన శిక్షణ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. దీంతో వందల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు. తమపై దాడి చేస్తే .. పరిస్థితి ఏంటో భారత్ మరోసారి నిరూపించింది.
దౌత్యనీతితో విడుదల ..
బాలాకోట్ దాడి తర్వాత కూడా పాకిస్థాన్ వైమానిక దళ దాడికి దిగడంతో .. వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ ధీటుగా తిప్పికొట్టి పాకిస్థాన్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే అతనిని క్షేమంగా భారత్ రప్పించడంలో భారత్ ప్రదర్శించిన దౌత్యంలోనూ అజిత్ దోవల్ మార్క్ ఉంది. లేదంటే వగలమారి పాకిస్థాన్ .. అభినందన్ను అప్పగించి ఉండకపోయే పరిస్థితి ఉండేది. మొత్తానికి ఈ ఐదేళ్లలో భారత్ .. తమ శత్రుదేశం .. దాయాది పాకిస్థాన్పై ధీటుగా స్పందించి .. తామంటే ఏంటో నిరూపించింది. ఇందులో అజిల్ దోవల్ పాత్ర క్రియాశీలకం. అందుకే ఆయనను మరోసారి జాతీయ భద్రతా సలహాదారునిగా నియమిస్తూ .. క్యాబినెట్ హోదా కల్పించారు ప్రధాని మోడీ.