అంతా ప్రశాంతంగా ఉంది.. కాశ్మీర్లో పరిస్థితులపై కేంద్రానికి అజిత్ ధోవల్ రిపోర్ట్..
ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పరిశీలించారు. అక్కడి పరిస్థితుల గురించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. కేంద్రం నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖకు రిపోర్టు పంపారు.
జమ్మూ కాశ్మీర్ను ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. లోయలో పరిస్థితులు చక్కబడిన అనంతరం సరైన సమయంలో తిరిగి రాష్ట్రంగా మారుస్తామన్న ఆయన ప్రకటనపై అక్కడి వారు సానుకూల వైఖరితో ఉన్నట్లు అజిత్ దోవల్ నివేదికలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనంతరం జమ్మూకాశ్మీర్లో వాతావరణం ప్రశాంతంగానే ఉందని... ఎలాంటిం ఆందోళనలు, నిరసనలు చేపట్టడంలేదని చెప్పారు. కేంద్రం తీసుకున్న చర్యలు, పార్లమెంటులో చేసిన ప్రకటనలపై వారంతా సంతృప్తితో ఉన్నారని రిపోర్టులో చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన విషయంలో అజిత్ ధోవల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికారాలు, బాధ్యతల బదలాయింపు సజావుగా సాగేలా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారు.