అర్ధరాత్రి హైటెన్షన్: ఫడ్నవీస్-అజిత్ పవార్ భేటీ, సుప్రీంకోర్టు విచారణ గురించి కాదట...
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం అర్ధరాత్రి సమావేశమయ్యారు. సీఎం అధికార నివాసంలో భేటీ జరిగినట్టు సీఎంవో అధికారులు తెలిపారు. వీరి సమావేశంలో సుప్రీంకోర్టు విచారణ గురించి చర్చకు రాలేదని.. రాష్ట్రంలోని సమస్యలపై డిస్కష్ చేశారని అధికారులు సెలవిచ్చారు.
బీజేపీ నేతలు కూడా..
సీఎం, డిప్యూటీ సీఎం సమావేశంలో బీజేపీ సీనియర్ నేతలు చంద్రకాంత్ పాటిల్, వినోద్ తవడే, గిరిశ్ మహాజన్ పాల్గొన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీజేపీతో సహా వాదనలు విన్న సర్వోన్నత ధర్మాసనం ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీచేసింది. ఈ అంశంపై డిస్కస్ చేసేందుకు సమావేశమైన.. పైకి మాత్రం మరో అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు.
రైతుల గురించి అట..
రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదని అధికారులు చెప్తున్నారు. ఆకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన విధానాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై సోమవారం కూడా చర్చిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శితో సమావేశమవుతారని సీఎంవో వర్గాలు ప్రకటించాయి.
సుప్రీంకోర్టు విచారణ
మహారాష్ట్రలో శనివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేసి.. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా పదవీ ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఫడ్నవీస్, అజిత్కు నోటీసులు జారీచేసి.. సోమవారం ఉదయానికి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
పైకి మాత్రం
రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తుంటే.. ఫడ్నవీస్-అజిత్ మాత్రం రైతు సమస్యల కోసం సమావేశమైన కవరింగ్ చేస్తున్నారు. తమ ప్రభుత్వ ఉనికి, అస్దిత్వాన్ని నిలుపుకోవాల్సిన సమయంలో వారు రైతుల బాగోగులు చర్చిస్తున్నామని పైకి చెప్తున్నారు. కానీ లోలోన మాత్రం సోమవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు చేపట్టే విచారణ మీదే సుదీర్ఘంగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తమ భవిష్యత్ కార్యాచరణతో ఎలా ముందుకెళ్లాలని.. సమావేశంలో పాల్గొన్న న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్టు తెలిసింది.