మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ : జాబితాలో పెద్ద తలకాయలు..?
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరిగి చివరకు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే బాధ్యతలు చేపట్టగా.. శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
తాజాగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. సోమవారం మధ్నాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మంత్రుల జాబితాలో ఎవరెవరికి చోటు దక్కబోతుంది అన్న చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి.. ఆపై రెండు రోజులకే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్సీపీతో చేరిన అజిత్ పవార్పై అందరి దృష్టి నెలకొంది. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చునన్న వాదన వినిపిస్తోంది.
అలాగే శివసేన ఎమ్మెల్యే ఆదిత్యా థాక్రేను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యే నవాబ్ మాలిక్కి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కేసీ పడ్వి, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్లకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, శివసేనకు 16 బెర్తులు, ఎన్సీపీకి 14, కాంగ్రెస్ పార్టీకి 12 మంత్రి పదవులు ఉండేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం జరిగినట్టు ప్రచారం జరిగింది. మూడు పార్టీల మధ్య అవగాహన తర్వాత శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరగబోయే విస్తరణలో అజిత్ పవార్కు పెద్ద పీట వేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.