శరద్ పవార్ చాణక్యం: తలొంచిన అజిత్.. రేపో మాపో సొంత గూటికి..!
ముంబై: మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో బల పరీక్షను నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ సర్కార్ నేలకూలింది. అనూహ్య పరిణామాల మధ్య తొలుత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పదవి నుంచి వైదొలగారు.
మూడు చక్రాల కుర్చీ సర్కార్.. ఎన్నాళ్లుంటుందో..అంతా ఆయనే చేశారు: ఫడ్నవీస్
నిలబడటానికి, కుప్పకూలడానికీ.. కారణం ఒక్కరే..
బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి, కుప్పకూలిపోవడానికి ఒకే ఒక్కరు కారణం. ఆ ఒక్కరే- అజిత్ పవార్. రాజకీయాల్లో తలపండిన నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్ కు స్వయానా సోదరుడి కుమారుడు. తనకు 54 మంది ఎమ్మెల్యేల బలం ఉందని భారతీయ జనతా పార్టీకి నమ్మించారు. ఆయా ఎమ్మెల్యేల పేర్లు, సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనవంతు సహకారాన్ని అందించారు. ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లో రాజీనామా బాట పట్టారాయన.
శరద్ పవార్ చాణక్యం..
అనూహ్యంగా అజిత్ పవార్ రాజీనామా చేయడం వెనుక..శరద్ పవార్ చాణక్యం ఉందని అంటున్నారు ఎన్సీపీ నాయకులు. చేజారిన పోయిందనుకున్న అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం వెనుక శరద్ పవార్ రాజకీయ అనుభవం ఉందని చెబుతున్నారు. 54 మంది ఎమ్మెల్యేల బలం తనకు ఉందని ప్రకటించుకున్న అజిత్ పవార్ వెంట ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లకుండా నిరోధించడంలో శరద్ పవార్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారని అంటున్నారు.
గ్రాండ్ హయాత్ లో పరేడ్ తో సగం విజయం..
ముంబైలోని గ్రాండ్ హయాత్ లో సోమవారం రాత్రి శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి చెందిన 162 మంది శాసన సభ్యులతో పరేడ్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన రావడంతోనే సగం విజయం సాధించారని అంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్ కంటే 17 మంది ఎమ్మెల్యేల బలం అదనంగా ఉన్నట్లు శివసేన సారథ్యంలోని కూటమి నిరూపించుకోవడానికి శరద్ పవార్ ఆలోచనే పని చేసిందని సమాచారం.
అజిత్ ను ఒంటరి చేయడంలో ఫలించిన మంత్రాంగం..
తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో పరేడ్ ను ఏర్పాటు చేయాలని శరద్ పవార్ ఆదేశించారని, దీనికి అనుగుణంగా నిర్దేశించిన ఎమ్మెల్యేల సంఖ్య కంటే ఏ ఒక్కరు కూడా బీజేపీ వైపునకు వెళ్లకుండా అడ్డుకోవడంలో ఆయన అనుసరించిన వ్యూహాలు, వేసిన ఎత్తులు ఫలించాయని చెబుతున్నారు. ఫలితంగా- ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అజిత్ పవార్ వెంట లేరని అంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యేలు కూడా పార్టీ వెంటే ఉండేలా చేయగలిగారని తెలుస్తోంది. అజిత్ పవార్ తమ కూటమిలోని నాయకుడేనంటూ శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఇదేనని చెబుతున్నారు.