ఆది నుంచి అజిత్ పవార్ వివాదాస్పదమే.. సుప్రియతో వేగలేకనే బీజేపీకి చేరువగా?
అజిత్ పవార్.. ఎన్సీపీ నేత, శరద్ పవార్ అన్న కుమారుడు... అంతకన్నా మహారాష్ట్ర రాజకీయాల్లో కుదుపులో కీ రోల్ పోషించిన వ్యక్తి అని చెప్పడమే ఉత్తమం. తమ అధినేత శరద్ పవార్ను ధిక్కరించి అజిత్ అడుగులు వేయడానికి కారణం ఎవరూ ? సొంత నిర్ణయమా ? లేదంటే పవార్ కూతురు సుప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమా ? ఇంతకీ అజిత్ పవార్ తెరచాటు రాజకీయాలకు కారణం ఎవరు ? వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.
అజిత్ పవార్ కు షాక్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యేలు .. శరద్ పవార్ దగ్గరకు వెళ్లి సంచలన వ్యాఖ్యలు
అన్న కుమారుడు
అజిత్ పవార్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడు అనంతరావు కుమారుడు. శరద్కు అజిత్ వెన్నుదన్నుగా నిలిచారు. 1991లో పార్టీ స్థాపించినప్పటి నుంచి అట్టిపెట్టుకొని ఉన్నారు. శరద్ పవార్ తర్వాత పార్టీ పీఠాన్ని అధిష్టించబోయేది అజిత్ పవార్ అని ఊహాగానాలు కూడా పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
పవార్ తర్వాత..
అజిత పవార్ కూడా తానే పార్టీ చీఫ్ అని భావించారు. కానీ ఇంతలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2009లో తెరపైకి శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తనకు సుప్రియ పోటీదారుగా నిలుస్తోందని అజిత్ భావిస్తోన్నారు. దీంతోపాటు శరద్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ కూడా తెరపైకి వచ్చారు. 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. దీంతో పార్టీలో తన స్థానంపై అజిత్ పవార్కు లోలోన భయం పట్టుకుంది. పార్టీలో తర్వాత అధ్యక్ష స్థానం తనకు దక్కబోదనే ఆందోళన నెలకొంది.
కూటమి..
పార్టీలో తనకంటూ స్థానం కోసం అజిత్ పవార్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2012లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. జలవనరులశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో తన పదవీకి అజిత్ పవార్ రాజీనామా చేశారు. మరికొదందరు మంత్రులతో రాజీనామా చేయించడంతో అశోక్ చవాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో వెంటనే శరద్ పవార్ రంగంలోకి దిగారు. అజిత్ను ఒప్పించి.. ప్రభుత్వాన్ని కాపాడగలిగారు.
పవార్ దూరం
అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో 2019లో శరద్ పవార్ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తాను పోటీ చేయబోనని ప్రకటించారు. దీంతో పవార్ అసెంబ్లీ స్థానం మావల్ నుంచి తన కుమారుడిని పోటీ చేయిస్తానని అజిత్ ప్రకటించారు. దీనిపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు.
రాజీనామాస్త్రం
స్వార్థపూరితంగా రాజకీయాలు చేయడం అజిత్ పవార్కు వెన్నతో పెట్టిన విద్య. గత సెప్టెంబర్లో తన ఎమ్మెల్యే పదవీకి అజిత్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ స్కాంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును ఈడీ చేర్చడంతో.. రాజీనామాస్త్రం సంధించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బారామతి నుంచి పోటీచేసి గెలుపొందారు.