53 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీతోనే.. అజిత్ పవార్ ఒక్కరే, రంగంలోకి ఛగన్ భుజ్బల్...
మహారాష్ట్ర రాజకీయాలను రాత్రికి రాత్రే మలుపుతిప్పిన ఎన్సీపీ నేత అజిత్ పవార్తో ఆ పార్టీ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తోంది. ఆదివారం మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్.. అజిత్తో భేటీ కాగా.. ఇవాళ ఛగన్ భుజ్బల్ రంగంలోకి దిగారు. శరద్ పవార్ ఆదేశాలతో భుజ్బల్ అజిత్ పవార్తో చర్చలు జరిపేందుకు ముందుకొచ్చారు.
డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పినా..
ఛగన్ భుజ్బల్తో కూడా చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. బీజేపీతో డిప్యూటీ సీఎం పదవీ ఎలా స్వీకరించారో..రెండున్నరేళ్లు డిప్యూటీ సీఎం పదవీ శివసేన కూటమిలో కూడా అప్పగిస్తామని అజిత్ పవార్కు తెలిపినట్టు సమాచారం. కానీ దీనిపై కూడా అజిత్ పవార్ రాజీపడలేదని తెలిసింది. మరోవైపు అజిత్ పవార్కు రెండేన్నరేళ్ల సీఎం పదవీ ఇస్తారనే ప్రచారాన్ని శివసేన తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.
53 మంది తమతోనే
మహారాష్ట్రలో ఎన్సీపీ 54 స్థానాలు గెలిచింది. ఆదివారం వరకు 49 మంది తమతో ఉన్నారని ఎన్సీపీ ప్రకటించింది. సోమవారం ఉదయం ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నేతలు ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ నుంచి ముంబై తీసుకొచ్చారు. అనిల్ పాటిల్, బాబాసాహెబ్ పాటిల్, దౌలత డరోడ, నర్హరి జిర్వార్ ముంబైకి తరలించారు. మరోవైపు పుణెలో తన ఫ్యామిలీతో ఉన్న అన్న బాన్సోడ్ కూడా తమతో కలుస్తారని ఎన్సీపీ ధీమాతో ఉంది. ఎన్సీపీ నాయకత్వం అంచనా మేరకు 53 మంది ఎమ్మెల్యేలు పార్టీతో ఉండగా.. అజిత్ పవార్ ఒక్కరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని తెలుస్తోంది.
ట్విస్ట్..
శివసేన కూటమి శనివారం ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలోనే.. బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో పవర్ గేమ్ మొదలైంది. కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ ఒకవైపు బీజేపీ-అజిత్ పవార్ మధ్య మాటలయుద్ధం జరుగుతుంది.
శరద్ పవార వైపు
అజిత్ పవార్తో తొలుత 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ 13 మంది అని తర్వాత క్లారిటీ వచ్చింది. అందులో ఏడుగురు శనివారం శరద్ పవార్ వద్దకొచ్చారు. మిగతా ఐదుగురు కూడా ఎన్సీపీ వైపు మళ్లారు. శరద్ పవార్ తనదైన చాణక్య రాజకీయంతో ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నారు.
రంగంలోకి భుజ్బల్
అజిత్ పవార్ను కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవీకి రాజీనామా చేయాలని కోరారు. ఆదివారం జయంత్ పాటిల్తో రాయబారం పంపించారు. అది బెడిసికొట్టడంతో ఇవాళ ఛగన్ భుజ్బల్కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ వైపు మళ్లడంతో.. అజిత్ పవార్ తిరిగి సొంతగూటికి చేరడం తప్ప మధ్యేమార్గం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.