సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే రాజీనామా చేయాలన్న నిర్ణయానికొచ్చేశా: అజిత్ పవార్
ముంబై: దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీని నాలుగు రోజుల్లో ముంచిన మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన తప్పును తెలుసుకున్నట్లు చెప్పాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతోనే తన నిర్ణయంలో మార్పు వచ్చిందని వెల్లడించారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని భావించి ఆ మేరకు చేసినట్లు అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. ఎన్సీపీని వీడేది లేదని స్పష్టం చేసిన అజిత్ పవార్... తాను ఎన్సీపీ ఎమ్మెల్యేనేనని గుర్తు చేశారు. అంతేకాదు భవిష్యత్తులో పార్టీ తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా చేస్తానని అజిత్ చెప్పారు.
అజిత్ పవార్కు సుప్రియా ఆత్మీయ ఆలింగనం: ఆదిత్య థాక్రేకు స్వాగతం, ఫడ్నవీస్తో ముచ్చట్లు
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాక అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీతోనే తాను ఉన్నానని ఎన్సీపీతోనే ఉంటానని అజిత్ దాదా చెప్పారు. తనను పార్టీ నుంచి ఎవరూ బహిష్కరించలేదని మరోసారి గుర్తుచేశారు అజిత్ పవార్. తనను పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా ఎక్కడైనా విన్నారా పోనీ చదివారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ తాను ఎన్సీపీ ఎమ్మెల్యేనే అని చెప్పారు. ఇక తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది పార్టీ నిర్ణయిస్తుందని అజిత్ పవార్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తనతో కొందరు పార్టీ సభ్యులు చర్చలు జరిపాక తన మనసును మార్చుకున్నట్లు అజిత్ పవార్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ సీనియర్ పవార్ను కలిసి క్షమాపణ కోరారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. ప్రభుత్వంలో తను ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తారో త్వరలోనే పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. అసాధారణం అనుకున్నవి సాధించి చూపించారంటూ అజిత్ పవార్పై సెటైర్ వేశారు సంజయ్ రౌత్.
మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు తలుపును తట్టడంతో బలనిరూపణకు ఒక్కరోజు సమయం మాత్రమే ఇచ్చింది కోర్టు. సమయం తక్కువగా ఉండటంతో మంగళవారం మధ్యాహ్నం అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా రాజీనామా చేశారు. అనంతరం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు బుధవారం అసెంబ్లీకి వచ్చిన అజిత్ దాదాను సోదరి సుప్రియా సూలే ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.