బీహార్ కాంగ్రెస్లో రచ్చ రచ్చ -‘చిరుత’ హీరోయిన్ తండ్రి అజిత్ శర్మకు కీలక పదవి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో మహాకూటమి పుట్టిముంచి... ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ కల్ని కల్లలు చేసిన పార్టీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ లో మళ్లీ ముసలం ఏర్పడింది. వచ్చే వారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్నవేళ అన్ని పార్టీలూ తమ శాసనసభాపక్ష నేతలను ఎన్నుకుంటుండగా.. గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ లో మాత్రం వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం తలపెట్టిన సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రయ రచ్చకు దారి తీసింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో 125 సీట్లు సాధించిన ఎన్డీఏ తన అధికారాన్ని నిలబెట్టుకోగా, మహాకూటమి 110 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించగా, కూటమిలోని లెఫ్ట్ పార్టీలు కూడా 80శాతం సీట్లలో గెలుపొందాయి. కానీ పొత్తులో భాగంగా 70 చోట్ల పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే సాధించి, ఓవరాల్ గా కూటమి ఓటమికి ప్రధాన కారణం అయింది. శుక్రవారం సీఎల్పీ నేత ఎంపిక చేపపట్టగా.. ఉన్న 19 మందిలో ఇద్దరు డుమ్మా కొట్టారు. వచ్చినవాళ్లలో..
పరీశీలకుల ముందే కొట్లాట..
పాట్నాలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియకు ఏఐసీసీ పరిశీలకులుగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్, మహారాష్ట్రకు చెందిన అవినాశ్ పాండేలు హాజరయ్యారు. ముందుగా అధినేత్రి సోనియా గాంధీ సందేశాన్ని వినిపించిన పరిశీలకులు.. సీఎల్పీ నేత ఎంపకు ప్రయత్నించగా.. బిక్రమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సిద్ధార్థ్ సింగ్, మహారాజ్ గంజ్ ఎమ్మెల్యే విజయ్ శంకర్ దుబేలు అడ్డుపడ్డారు. సీఎల్పీ నేతను ఎంపక చేయకుండా.. ఎన్నిక చేపట్టాలని డిమాండ్ చేశారు. అది కాంగ్రెస్ సంప్రదాయాలకు విరుద్ధం కావడంతో మిగతా నేతలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో తీవ్రవాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో కొట్లాడుకునే స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. చివరికి..
Recommended Video
నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ..
ఎలాగోలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాంతిపజేసిన ఏఐసీసీ పరిశీలకులు.. బీహార్ సీఎల్పీ నేతగా అజిత్ శర్మ పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధినేత్రి సోనియాకు చేరవేసి, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నేతలు మీడియాతో మాట్లాడారు. భగల్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన సీనియర్ నేత అజిత్ శర్మను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు తెలిపారు. అజిత్ శర్మ మరెవరో కాదు, రాంచరణ్ ‘చిరుత' సినిమాతో పరిచయమై, తెలుగునాట పాపులరైన హీరోయిన నేహా శర్మ తండ్రే. తాజా ఎన్నికల్లో తండ్రి తరఫున నేహా సైతం భగల్ పూర్ లో ప్రచారం నిర్వహించారు. చివరికి బీజేపీ అభ్యర్థి రోహిత్ పాండేపై 1113ఓట్లతో అజిత్ శర్మ విజయం సాధించారు. సీఎల్పీ భేటీకి గైర్హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు అధిర్ రహమాన్, మనోహర్ ప్రసాద్ లకు ఆరోగ్యం బాగోలేక రాలేకపోయారని బీహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ ఝా చెప్పారు.