అజ్మీర్ దర్గాను బాంబులతో పేల్చేస్తామని ఫోన్
అజ్మీర్: దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాను బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ సందర్బంలో అజ్మీర్ దర్గాలో లక్ష మందికి పైగా భక్తులు ఉన్నారు. భక్తులు ఆందోళనతో హడలిపోయారు.
12వ శతాబ్ధం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో సోమవారం ఉదయం భక్తులు ఉన్నారు. అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఉదయం 6.40 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి దర్గాలో బాంబులు పెట్టామని, నిమిషాలలో పేల్చివేస్తామని బెదిరించారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, బాంబు నిర్వీర్యదళాలు, పొలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల ఉన్న భక్తులను అన్ని గేట్లు నుంచి బయటకు పంపించారు. దర్గా చుట్టు ఉన్న పరిసర ప్రాంతాలు ఖాళీ చేయించారు.
క్వీక్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసు కమాండోలు బాంబు డిటెక్టర్లతో సుమారు గంట పాటు దర్గాలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబులు కనపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయం 7.45 గంటల నుంచి 9.15 గంటల వరకు అజ్మీర్ దర్గాను మూసివేశారు. భక్తులతో పాటు పోలీసులను హడలు పుట్టించిన ఆ ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అధికారులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత చర్యగా అజ్మీర్ దర్గా దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఎర్పాటు చేశారు.