jharkhand poll: బీజేపీతో బంధం వీడనిది, కమలంతోనే దోస్తి అంటోన్న ఏజేఎస్యూ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ రెండోస్థానానికి పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆ పార్టీ మెజార్టీ మార్క్కు ఆమడదూరంలో నిలిచిపోతుందని పేర్కొన్నాయి. కానీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (ఏజేఎస్యూ) మాత్రం బీజేపీ వెన్నంటే ఉంటానని భరోసానిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి రాదని చెబుతోన్నా.. ఏజేఎస్యూ మాత్రం కమల దళం వైపు ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏజేఎస్యూ మూడు నుంచి ఏడు సీట్లలో విజయం సాధిస్తోందని పోల్ పండితులు తెలిపారు. కాంగ్రెస్ కూటమి విజయం తథ్యమని అంచనా వేశాయి. బీజేపీ 20 నుంచి 30 సీట్ల మధ్య నిలిచిపోతుందని లెక్కగట్టాయి. కానీ ఏజేఎస్యూ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను విశ్వసించడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తోందనే ధీమాలో ఉంది. పోల్ పండితుల అంచనాలు తప్పుతాయనే భావనలో ఉన్నాయి.
ఏజేఎస్యూ చీఫ్ సుదేశ్ మహతో బీజేపీపై విశ్వాసంతో ఉన్నారు. తమ భాగస్వామ్య పక్షం బీజేపీతో కలిసే ఉంటామని స్పష్టంచేశారు. మాట మార్చేది లేదని స్పష్టంచేశారు. సుదేశ్ మహతో మాటల్లో ఆంతర్యం మాత్రం తెలియడం లేదు. కానీ ఆయన బీజేపీపై నమ్మకం పెట్టుకోవడానికి బలమైన కారణం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇండియా టు డే మై యాక్సిస్ సహా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కూటమి 40 సీట్ల వరకు గెలుచుకుంటుందని లెక్కగట్టాయి. బీజేపీ 20 నుంచి 30 సీట్ల లోపే విజయం సాధిస్తోందని పేర్కొనగా.. సుదేశ్ మహతో కామెంట్స్ మాత్రం చర్చకు దారితీశాయి.