చైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రి
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. గడిచిన నాలుగు నెలలుగా ఇరువైపులా భారీగా సైనిక మోహరింపులు, మధ్యలో హింసాత్మక ఘర్షణలు, ఇటీవల కాల్పుల ఉదంతం, మరోవైపు సైనిక, దౌత్య మార్గాల్లో పలు దఫాల భేటీలు.. మొత్తంగా సరిహద్దులో అసలేం జరుగుతున్నదో పార్లమెంటుకు కేంద్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, సైన్యానికి దేశమంతా అండగా నిలుస్తుందని చెబుతూనే.. రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ ఏకే ఆంటోనీ ''పెట్రోలింగ్'' ప్రక్రియపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
చైనాకు చెక్ పెట్టేందుకే బడ్జెట్ పెంపు - డ్రాగన్ చెప్పేదొకటి, చేసేది మరోటి: రాజ్యసభలో రాజ్నాథ్
అసలేం జరిగిందంటే..
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఎల్ఏసీని చైనా గుర్తించడం లేదని, కొత్త, పాత ఒప్పందాలను సైతం ఉల్లంఘిస్తుననదని, మొత్తం 90వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా తనదిగా పేర్కొంటూ ఆక్రమణలకు పాల్పడిందని, ఇటీవల తూర్పు లదాక్ లో మరో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, భారత బలగాలు అడ్డుకున్నాయని రాజ్ నాథ్ సభకు తెలిపారు. అయితే, తూర్పు లదాక్ లో కీలకంగా ఉన్న ఫింగర్ పాయింట్స్ వద్ద భారత ఆర్మీ నిర్వహించే పెట్రోలింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీ ఏకే ఆంటోనీ కీలక ప్రశ్నలు సంధించగా, అది సున్నితమైన అంశం కాబట్టి వివరాలు చెప్పలేనని రాజ్ నాథ్ బదులిచ్చారు.
చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - ఎలా దెబ్బకొడతారంటే..
మనోళ్లు పెట్రోలింగ్ చేయట్లేదా?
‘‘గాల్వాన్ లోయ మొదటి నుంచీ వివాదరహితంగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా మన ఆర్మీ అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నది. పాంగాగ్ సరస్సుకు ఉత్తరంగా ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు.. అంటే, ఫింగర్ 8 వరకూ మనవాళ్లు పెట్రోలింగ్ చేసేవారు. మరి, ఇప్పుడు కూడా మనవాళ్లు పెట్రోలింగ్ చేస్తున్నారా?, సరిహద్దులో యథాతథ స్థితిని కాపాడుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారుసరే, కానీ అసలీ ఏడాది ఏప్రిల్ నాటికి స్టేటస్ కో ఏమిటి? ఏప్రిల్ నాటికి మనం ఫింగర్ 8 వరకు పెట్రోలింగ్ నిర్వహించామా, లేదా?'' అని ఏకే ఆంటోనీ ప్రశ్నించారు.
ఆర్మీ వెంటే కాంగ్రెస్, దేశం..
చైనాతో సరిహద్దు వివాదాల అంశంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ కొరుతున్నామే తప్ప, కాంగ్రెస్ పార్టీగానీ, దేశ ప్రజలుగానీ ఎల్లప్పుడూ భారత సైన్యం వెంటే అండగా నిలబడి ఉంటుందని, ఈ విషయంలో ప్రభుత్వానికి నూటికి నూరు శాతం మద్దతు ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. మరో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. లదాక్ లో ఏప్రిల్ నాటి స్టేటస్ కో వివరాలు, ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను పార్లమెంటుకు వివరించాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో రాజ్ నాథ్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ నేతలు ఈ మేరకు వ్యాఖ్యలు చేయగా, అందుకు రక్షణ మంత్రి మరోసారి వివరణ ఇచ్చారు..
వివరాలు చెప్పలేను.. కానీ అడ్డుకోలేరు..
‘‘తూర్పు లదాక్ లో పెట్రోలింగ్ అంశంపై ఏకే ఆంటోని వెలిబుచ్చిన సందేహాలపై నేను వివరణ ఇవ్వలేను. ఎందుకంటే అది చాలా సున్నితమైన, సాంకేతిక అంశం. అయితే, ఒక్కటి మాత్రం నిజం.. సరిహద్దుల్ని కాపాడేందుకు మన సైనికులు ధీటుగా పోరాడుతున్నారు. పెట్రోలింగ్ నిర్వహించకుండా మనల్ని ఎవరూ ఆపలేరు. పెట్రోలింగ్ ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదు. అయితే, ఈ ఏడాది పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. వివాదరహితం అనుకున్న పాయింట్ల వద్ద కూడా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇంతకు మించి దీనిపై ఎక్కువగా మాట్లాడలేను'' అని రాజ్ నాథ్ బదులిచ్చారు.
Recommended Video
వెంకయ్య చొరవతో అంతా కూల్..
చైనా సరిహద్దులో ఏప్రిల్ నాటి స్టేటస్ కో, తూర్పు లదాక్ లో భారత ఆర్మీ పెట్రోలింగ్ అంశాలపై తాము లేవనెత్తిన సందేహాలపై ప్రభుత్వం నుంచి స్పస్టమైన వివరణ రాకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. వంద శాతం మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పిన తర్వాత కూడా అంశాలపై క్లారిటీ ఇవ్వకపోతే ఎలా? అని వ్యాఖ్యానించారు. దీంతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నారు. సున్నితమైన రక్షణ వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం సబబుగా ఉండదని, విపక్ష పార్టీ నుంచి ఐదు గురు సీనియర్ నేతలు ముందుకొస్తే.. తన ఛాంబర్ లోనే రక్షణ మంత్రితో నేరుగా మాట్లాడే ఏర్పాటు చేస్తానని వెంకయ్య సూచించడంతో సభ్యులందరూ నిదానించారు. ఈ ఎపిసోడ్ తర్వాత చైర్మన్ వెంకయ్య రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.