తేలని తెలంగాణ: నివేదికకు టైమ్ కావాలన్న ఆంటోనీ
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ముందుకు కదలడంలో జాప్యం జరుగుతోంది. తెలంగాణపై కదలిక రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనకడుగు వేయకూడదని కాంగ్రెసు అధిష్టానం కచ్చితమైన నిర్ణయంతో ఉన్నప్పటికీ ముందుకు కదలడానికి తగిన వెసులుబాటు కలగడం లేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలను పరిష్కరించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏ ప్రాంతాన్నీ నొప్పించకుండా నిర్ణయం తీసుకునేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది.
ప్రధాని మన్మోహన్ విదేశీ పర్యటనకు వెళ్లే లోగానే రాష్ట్ర విభజన నోట్ను మంత్రివర్గం ముందుకు తెచ్చే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈనెల 25వ తేదీన అమెరికా వెళ్తున్నారు. తిరిగి 1వ తేదీన తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో 19న జరిగే కేబినెట్ సమావేశంలో విభజన నోట్ ఆమోదానికి రావచ్చని భావిస్తున్నారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా నుంచి రావడంతో, కాంగ్రెస్ కోర్కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ నివాసంలో సమావేశమైంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, రక్షణ మంత్రి ఆంటోనీ గత నెల రోజులుగా రాష్ట్రానికి చెందిన నేతలతో జరిపిన సమావేశాల వివరాలను కోర్ కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది.
అయితే, నివేదికను తయారు చేసేందుకు మరింత సమయం కావాలని ఆంటోనీ సోనియాను కోరారు. దీంతో తెలంగాణ నోట్పై కోర్కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోలేకపోయింది. కమిటీ సభ్యులు సత్వరమే ఒక నిర్ణయానికి రావాలని, ఎక్కువ మందిని సంతృప్తిపరిచే ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలని ఆంటోనీకి సోనియా సూచించినట్లు తెలిసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే కేబినెట్ నోట్ తయారీకి అవసరమైన రాజకీయ దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుందన్న దానిపై కోర్కమిటీ క్లుప్తంగా చర్చించినట్టు సమాచారం.
బహుశా మరో వారంలో ఆంటోనీ కమిటీ నివేదిక తయారయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే కేబినెట్ నోట్ తయారీ కసరత్తు జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానితో పాటు సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ సమావేశంలో పాల్గొన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొనలేదు.