రాకేష్ ఆస్తానా కేసు: వాట్సాప్ మెసేజ్లను కోర్టులో బయటపెట్టిన అధికారి ఏకే బస్సీ
ఢిల్లీ: సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా ముడుపులు వ్యవహారాన్ని విచారణ చేస్తున్న సీనియర్ అధికారి ఏకే బస్సీ పోర్ట్బ్లెయిర్కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. తన బదిలీ అన్యాయం అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాకేష్ ఆస్తానా పై వచ్చిన ఆరోపణలపై తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ముందుగా న్యాయస్థానానికే సాక్ష్యంగా వాట్సాప్ మెసేజ్లను సమర్పించారు. ఆస్తానా హైదరాబాద్ పారిశ్రామికవేత్త సతీష్ సానా దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారని చెప్పేందుకు ఈ మెసేజ్లే రుజువులని చెప్పారు. వాటిని ఇప్పుడు బహిర్గతం చేశారు ఏకే బస్సీ.
రాకేష్ ఆస్తానాకు మనోజ్ ప్రసాద్లకు సంబంధం ఏమిటి..?
రాకేష్ ఆస్తానాకు దుబాయ్లో పారిశ్రామికవేత్తగా ఉన్న మనోజ్ ప్రసాద్ల మధ్య ఏదో సంబంధం ఉందని అది కాల్ రికార్డ్స్ ద్వారా తెలుస్తోందని వెల్లడించారు. ముడుపుల వ్యవహారంలో ప్రసాద్ హస్తం ఉందని చెప్పారు. ఈ నెల మొదట్లో ప్రసాద్ను అరెస్టు చేశారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ డైరెక్టర్ దినేశ్వర ప్రసాద్ కుమారుడే మనోజ్ ప్రసాద్. ప్రసాద్ అనే వ్యక్తి మార్చి 2017 నుంచి తన ఫోన్ డేటాను డిలీట్ చేయలేదని దీంతో అతని నెంబరుకు వచ్చిన అన్ని మెసేజ్లను సీబీఐ సంపాదించగలిగిందని బస్సీ తెలిపారు. ఇందులో సతీష్ సానాతో మాట్లాడిని మాటలు కూడా తీసుకోగలిగామని బస్సీ స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పుడు తన స్థానంలో విచారణాధికారిగా సతీష్ దగర్ను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు బస్సీ. సతీష్ దగర్ సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందని తద్వారా రాకేష్ ఆస్తానాను కాపాడే యత్నం చేయొచ్చనే అనుమానం పిటిషన్లో వ్యక్తం చేశారు.
మనోజ్ ప్రసాద్ అరెస్టుతో సీన్లోకి కొత్త పేర్లు
జనవరి 2018లో మనోజ్ ప్రసాద్ సోదరుడు సోమేష్ ప్రసాద్ సతీష్ సానాను డబ్బులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకురావాలని మనోజ్ ప్రసాద్కు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. డబ్బులు ఇవ్వకుండా జారుకోవాలని చూస్తే తామేంటో చూపిస్తామని అర్థం వచ్చేలా మెసేజ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే రాకేష్ ఆస్తానా తనను కేసు నుంచి తప్పించేందుకు రూ. 5కోట్లు లంచం అడిగినట్లు సతీష్ సానా సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో తెలిపాడు . ఆ తర్వాత తనకు రక్షణ కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్టోబర్ 16న మనోజ్ ప్రసాద్ అరెస్టు అయిన తర్వాత తన సోదరుడు సోమేష్ ప్రసాద్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ప్రత్యేక కార్యదర్శి సమంత్ గోయెల్కు ఫోన్ చేసినట్లు బస్సీ వెల్లడించాడు. ఆ వెంటనే సమంత్ రాకేష్ ఆస్తానాకు ఫోన్ చేసినట్లు బస్సీ వివరించారు. ఇక సమంత్ గోయెల్, రాకేష్ ఆస్తానాలు మంచి మిత్రులని సమాచారం.
ఫోన్ కాల్స్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు
ఇక్కడ ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే ప్రసాద్ సోదరులకు సమంత్ గోయెల్ సంబంధం ఎక్కడ కుదిరింది అని ఆరా తీస్తే 2000 వరకు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంస్థకు డైరెక్టర్గా తన తండ్రి దినేశ్వర్ ప్రసాద్ పనిచేసిన విషయం బయటపడింది. అంతేకాదు దినేశ్వర ప్రసాద్ కూడా సమంత్ గోయెల్కు ఫోన్ చేసినట్లు బస్సీ తెలిపారు. ఒక ఫోన్ కాల్లో సోమేష్ ప్రసాద్ తన మామ సునిల్ మిట్టల్తో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో డబ్బులు తీసుకునే వ్యక్తి మనవాడే అంటే రాకేష్ ఆస్తానే అని చెబుతున్నట్లుగా ఉంది. అంతేకాదు మరో కాల్ ప్రకారం మనోజ్ ప్రసాద్ ఆస్తానాను కలిశాడని ఆ తర్వాత సమంత్ గోయెల్ మనోజ్ ఎట్టి పరిస్థితుల్లో భారత్కు రాకూడదని చెప్పినట్లు ఫోన్కాల్ ద్వారా తెలుస్తోంది. ఇక దీన్నే ఎఫ్ఐఆర్లో చేర్చింది సీబీఐ. ఈ విషయాన్నే బహిర్గతం చేశారు బస్సీ.