ఎన్డీఏకు అకాలీదళ్ రాంరాం: వ్యవసాయ బిల్లులపై నిరసన, కూటమి నుంచి బయటకు..
ఎన్డీఏ కూటమికి శిరోమణి అకాలీదల్ గుడ్ బై చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నామని తెలిపింది. వ్యవసాయ బిల్లులు ఇటీవల చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే బిల్లులను తొలినుంచి అకాలిదల్ వ్యతిరేకిస్తోంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. దీంతో కూటమి నుంచి వెళ్లిపోతున్నామని ప్రకటించింది.
హరిసిమ్రత్ కౌర్ రాజీనామా
ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు అకాళిదల్ అధ్యక్షుడు సుఖ్ బిందర్ సింగ్ బాదల్ ప్రకటించారు. అకాలిదల్ బీజేపీ మధ్య దశాబ్దాలుగా మైత్రీ ఉంది. పంజాబ్, కేంద్రంలో కలిసి పనిచేస్తున్నాయి. కానీ వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ బయటకు వచ్చింది. వాస్తవానికి అకాళిదల్ బయటకు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ రాజ్యసభలో సభ్యుల బలం తగ్గుతోంది.
వ్యవసాయ బిల్లులు..
వ్యవసాయ బిల్లులపై రగడ ఇటీవల ప్రారంభమైంది. కేంద్రమంత్రి పదవీకి కౌర్ రాజీనామా చేయగా.. ప్రభుత్వం నుంచి బయటకు రావాలని పార్టీ భావించింది. శనివారం అధ్యక్షుడు సుఖ్ బిర్ సింగ్ బాదల్ నేతృత్వంలో పార్టీ సమావేశం జరిగింది. వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని భావించింది.
రైతు బిడ్డగా..
పార్లమెంటులో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలిదల్ ఇదివరకే వైదొలగింది. ఆ పార్టీకి చెందిన ఏకైక మంత్రి హర్సిమ్రత్ కౌర్ తన పదవికి ఈ నెల 17వ తేదీన రాజీనామా చేశారు. రైతుల సోదరిగా, బిడ్డగా వారి తరఫున నిలిచినందుకు గర్వంగా ఉందని తెలిపారు. రాజీనామాకు కారణాలను వివరిస్తూ ప్రధాని మోదీకి నాలుగు పేజీల లేఖ రాశారు.
Recommended Video
చట్టాలకు సవరణ బిల్లులు..
గతంలో ఆర్డినెన్స్లుగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను సవరణ బిల్లులుగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే వీటిపై పంజాబ్, హర్యాణాల్లో రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. ఈ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పటిదాకా ఇస్తున్న కనీస మద్దతు ధరకు కేంద్రం ముగింపు పలకనుందని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది రాజకీయంగా తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని అకాలీదళ్ భావిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలిగింది.