అక్బర్ చక్రవర్తి ఏకంగా ఆ రాణినే గోకాడట:బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : నేతల నోళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారు చేసే వ్యాఖ్యలు సమాజంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించేవాడంటూ వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. ఆయన అసభ్యంగా ప్రవర్తించింది ఒక బికనేర్ రాణితో అని సైనీ చెప్పారు. మహిళల కోసమే ప్రత్యేకించి మీనా బజార్ అనేది అక్బర్ తీసుకొచ్చారని అక్కడికి మారువేషంలో వెళ్లి రాణిపై అసభ్యంగా ప్రవర్తించారని సైనీ చెప్పారు. ఇది చరిత్రలో కూడా ఉందని ఆయన అన్నారు. మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సైనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మీనా బజార్ మహిళల కోసమే అక్బర్ ప్రారంభించారని చెప్పిన సైనీ... అక్బర్ అసభ్యకర ప్రవర్తనతోనే వాటిని మూసివేయాల్సి వచ్చిందని సైనీ అన్నారు. ఒకరోజు మీనా బజార్కు బికనేర్ రాణి కిరణ్ దేవి వచ్చిన సందర్భంలో అక్బర్ కూడా మారువేషంల ఆ బజారుకు వెళ్లారని సైనీ గుర్తు చేశారు. ఇక కిరణ్ దేవి దగ్గరకు వచ్చి ఆమెపై అసభ్యకరంగా ప్రయత్నించారు. వెంటనే ఆమె తన ఖడ్గం తీసి అక్బర్ రొమ్ముపై ఉంచిదని సైనీ తెలిపారు. ఆ సమయంలో తనకు ప్రాణ భిక్ష పెట్టాల్సిందిగా అక్బర్ చక్రవర్తి వేడుకున్నాడని సైనీ తెలిపారు.
మరోవైపు మహారాణా ప్రతాప్ ఉన్నత వ్యక్తిత్వం కలవాడని చెప్పిన సైనీ... ఆయన తన మతం కోసం, సంస్కృతి కోసం, గౌరవం కోసం పోరాడాడని గుర్తు చేశారు. అంతేకాదు ఆయన ఎక్కడే కానీ ఇతరుల భూమిని లాక్కోలేదని, దేశంపై దండయాత్రకు వచ్చిన సమయంలో ఎదురొడ్డి పోరాడాడు తప్పితే ఎప్పుడూ వెన్ను చూపి పారిపోలేదని సైనీ కొనియాడారు.
సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. రాష్ట్రంలో బీజేపీ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని కాంగ్రెస్ మండిపడింది. మహారాణా ప్రతాప్ ధీరత్వం, ధైర్యంపై దేశం మొత్తం గర్విస్తోందని అతని సాహసాలను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేత అర్చన శర్మ. అయితే చరిత్రను వక్రీకరించి సైనీ మాట్లాడటం మంచిది కాదని ఆయన రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.