ఉత్తర్ ప్రదేశ్లో తొలి పరీక్ష ఎదుర్కోనున్న అఖిలేష్ మాయావతి...ప్రజలు ఎవరివైపు..?
Recommended Video
బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలో మొత్తం 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో కోటిన్నర మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 8 స్థానాలను కైవసం చేసుకుంది. సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, మీరట్, భాగ్పత్, గజియాబాద్, గౌతం బుద్ధ నగర్ల స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ సారి బీజేపీకి మరో అవకాశం ఇవ్వరాదన్న ఆలోచనతోనే మాయావతి పార్టీ బీఎస్పీ అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్వాదీ పార్టీలు కలిశాయి. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మేనియా కూడా బీజేపీ విజయానికి దోహద పడిందని చెప్పాలి. ఆ తర్వాత యూపీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ 325 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఈ విజయం తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇద్దరు బద్ద శత్రువులు ఒక్కటవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యోగీ ఆదిత్యనాథ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగగా ఎస్పీ బీఎస్పీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంతో అక్కడ ఘన విజయం సాధించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో తిరిగి రెండు పార్టీలు 2019 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇక ఈ ఎన్నికలకు ఎస్పీ బీఎస్పీ అజిత్ సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్దళ్ చేతులు కలిపాయి. మొత్తం 80 స్థానాలకు గాను 78 స్థానాల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో పెట్టలేదు ఎస్పీ బీఎస్పీలు.
ఇక తొలి విడత ఎన్నికల్లో పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లోని 8 లోక్సభ నియోజకవర్గాల్లో ఎక్కువగా దళిత, ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న ముజఫర్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సిటింగ్ ఎంపీ సంజీవ్ బాల్యన్ పై ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇక గురువారం జరగనున్న తొలి విడత పోలింగ్లో ఉత్తరప్రదేశ్నుంచి ముగ్గురు కేంద్రమంత్రులు వీకేసీంగ్ (ఘజియాబాద్), సత్యపాల్ సింగ్ (బాగ్పత్), మహేష్ శర్మ(గౌతం బుద్ద నగర్)తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.