కాంగ్రెస్ ను కాదని ఎస్పీ-బీఎస్పీ కూటమిలో మరో పార్టీకి చోటు: మూడు సీట్లతో సరిపెట్టిన అఖిలేష్
లక్నో: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్ ను కాదని మరో పార్టీకి చోటు ఇచ్చింది ఎస్పీ-బీఎస్పీ కూటమి. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ) ఈ కూటమిలో చేరింది. రాష్ట్రీయ లోక్ దళ్ కు మూడు లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించింది. ఆర్ఎల్డీ పోటీ చేసే స్థానాలు ఏవో ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ- మధుర, బాగ్ పట్, ముజప్ఫర్ నగర్ స్థానాలను కేటాయించవచ్చని తెలుస్తోంది.
ఆర్ఎల్డీతో పొత్తు ఖరారు..
ఆర్ఎల్డీతో పొత్తు ఖరారైనట్టు ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీని అడ్డుకోవడానికే తాము ఆర్ఎల్డీని కూటమిలోకి చేర్చుకున్నట్లు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా నాటుకుపోయిన భారతీయ జనతాపార్టీని ఎదుర్కొనడానికి సమాజ్ వాది పార్టీ-బహుజన్ సమాజ్ వాది పార్టీలు జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని 80 లోక్ సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. దీనికి సంబంధించి.. ఇదివరకే సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేసుకున్నాయి.
అమేథీ, రాయ్ బరేలీ మినహా..
ఏఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే విషయాన్ని కూడా తేల్చేశాయి. బీఎస్పీ 38 స్థానాలు, ఎస్పీ 37 చోట్ల పోటీ చేయనున్నాయి. మరో అయిదు స్థానాలను తాత్కాలికంగా ఖాళీగా ఉంచాయి. వాటిల్లో రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ, సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తోన్న రాయ్ బరేలీ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయిదింట్లో ఈ రెండు పోగా, మిగిలిన మూడింటినీ రాష్ట్రీయ లోక్ దళ్ కు కేటాయించారు.
ఆర్ఎల్డీకి కేటాయించాలని భావిస్తోన్న మథుర, బాగ్ పట్, ముజప్ఫర్ నగర్ స్థానాలు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు చోట్లా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు చోట్ల కూడా బీఎస్పీ రెండో స్థానంలో, ఆర్ఎల్డీ మూడో స్థానంలో నిలిచాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడుస్థానాల్లో తాము పోటీ చేయకుండా ఆర్ఎల్డీ అభ్యర్థికి మద్దతు పలికితే.. గెలుపు సునాయాసమౌతుందనేది ఎస్పీ-బీఎస్పీ వ్యూహాం. నిజానికి- బాగ్ పట్ లోక్ సభ స్థానం ఆర్ఎల్డీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీకి కోల్పోయింది.