తండ్రి ఇలాకాలో తనయుడి పోటీ, ఆజంఘడ్ బరిలో అఖిలేష్ యాదవ్
లక్నో : ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నారు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి పోటీకి మాజీ సీఎం అఖిలేష్ సిద్ధమవుతున్నారు. పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో పార్టీ శ్రేణుల సూచనల మేరకు ఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఎస్పీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ములాయం సింగ్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంట్రెస్టింగ్
:
ప్రధాని
రేసులో
మొత్తం
అవివాహితులే
ఆజంఘడ్ నుంచి అఖిలేష్ పోటీ
80 లోక్సభ స్థానాలున్న యూపీలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 19 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన పార్టీ తాజాగా మరో లిస్టు రిలీజ్ చేసింది. దీంతో పాటు సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారం చేయనున్న 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లు ప్రకటించింది. తాజా లిస్టు ప్రకారం ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంఘడ్ నుంచి ఈసారి అఖిలేష్ యాదవ్ బరిలో నిలవనున్నారు. అఖిలేష్ తొలుత తన భార్య డింపుల్ యాదవ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కన్నౌజ్ నుంచి పోటీ చేస్తారని వార్త వచ్చినా చివరకు ఆయన తన తండ్రి స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో రాంగోపాల్ యాదవ్, ఆజం ఖాన్, జయా బచ్చన్, డింపుల్ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్లు ఉండగా.. ఈ జాబితాలోనూ ములాయంకు చోటు దక్కకపోవడం విశేషం.
మెయిన్ పురి బరిలో ములాయం
2014లో ములాయం సింగ్ ఆజంఘడ్తో పాటు మెయిన్పురి స్థానం నుంచి బరిలో దిగారు. ఆ తర్వాత మెయిన్పురి స్థానాన్ని వదలుకున్నారు. అయితే ఈసారి మాత్రం రెండో దశలో ఎన్నికలు జరగనున్న మెయిన్పురి నియోజకవర్గం నుంచి మాత్రమే ఆయన పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీకి గట్టి పట్టు ఉండటంతో ములాయం తప్పక విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి.
ముస్లిం లేదా యాదవులకే ఆజంఘడ్ ఓటర్ల పట్టం
1989 నుంచి ఆజంఘడ్ లోక్సభ నియోజకవర్గంలో ముస్లిం లేదా యాదవ్ వర్గానికి చెందిన నేతలకే అక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు. 2014లో అక్కడ ఎస్పీ, బీఎస్పీలు కలిసి 63శాతం ఓట్లు దక్కించుకున్నాయి. బీజేపీ నేత రమాకాంత్ యాదవ్ అప్పట్లో కేవలం 29 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు కూటమిగా ఏర్పడి బరిలో నిలుస్తున్నందున ఆ స్థానం ఎస్పీ ఖతాలో పడటంఖాయమని భావిస్తున్నారు. యూపీలో ఈసారి ఎస్పీ 37స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీఎస్పీ 38 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. ఆర్ఎల్ డీ 3 సీట్లలో పోటీ చేయనుంది. ఇక రాయ్ బరేలీ, అమేథీ స్థానాల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయి.