లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తా: భార్య డింపుల్ స్థానం నుంచి అఖిలేష్ పోటీ
లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రానున్న లోకసభ ఎన్నికల్లో కనౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగబోయే లోకసభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు అఖిలేశ్ ఇప్పటికే వెల్లడించారు.
ప్రస్తుతం తన సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా ఉన్న కనౌజ్ నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు అఖిలేశ్ ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
నేను కనౌజ్ లోకసభ నియోజకవర్గం నుంచి, ములాయం సింగ్ యాదవ్ మెయిన్పురి స్థానం నుంచి పోటీ చేస్తారని అఖిలేశ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు హామీలు మాత్రమే ఇస్తోందని, వాటిని ఆచరణలో పెట్టట్లేదన్నారు.
ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక డింపుల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై వస్తున్నవార్తలపై కూడా అఖిలేశ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదన్నారు.