ములాయంకు అఖిలేష్ దెబ్బకు దెబ్బ, చీలిక దిశగా ఎస్పీ!, జయప్రదకూ షాక్
లక్నో: ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీ చీలిక దిశగా కనిపిస్తోంది. తండ్రి ములాయం సింగ్, కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య గొడవ మరింత రాజుకుంటోంది. తన బాబాయి శివపాల్ యాదవ్ సహా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగించిన అఖిలేష్, ఓ విధంగా తండ్రికి సవాల్ విసిరారు.
బాబాయి శివపాల్, మరో సానియర్ నేత ఓపీసింగ్ తదితర నలుగుర్ని కేబినెట్ నుంచి అఖిలేష్ తొలగించారు. అనంతరం తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వంద మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
అఖిలేష్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ను కలిశారు. ఆయనను కలిసిన కాసేపటికో నలుగురి పైన వేటు వేసి తండ్రికి షాకిచ్చారు. ఫిల్మ్ ప్రమోషన్ బోర్డు పదవి నుంచి జయప్రదను కూడా తొలగించారు.
అంతకుముందు, సమాజ్ వాది పార్టీ.. అఖిలేష్ వర్గీయుల పైన వేటు వేసింది. దీనికి ప్రతిగా అఖిలేష్ పావులు కదిపారని అంటున్నారు.
ఎస్పీ అధినేత ములాయం సింగ్కు వ్యతిరేకంగా, అఖిలేశ్కు మద్దతుగా లేఖ రాసిన ఎమ్మెల్సీ ఉదయ్వీర్ సింగ్పై ఆ పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్లు పార్టీ అధికార ప్రతినిధి అంబికా చౌధరి వెల్లడించారు.
అగౌరవమైన, క్రమశిక్షణరాహిత్యమైన ప్రవర్తనకు గాను ఉదయ్వీర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రమశిక్షణ లేని వ్యక్తులను పార్టీ సహించదన్నారు. సీఎం అఖిలేశ్కు ఉదయ్వీర్ సింగ్ అత్యంత సన్నిహితుడు.
ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్, అతడి కుటుంబసభ్యులు మిమ్మల్ని( ములాయం సింగ్) తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ అధ్యక్ష పదవి నుంచి మీరు తప్పుకొని ఆ బాధ్యతలను సీఎం అఖిలేశ్కు అప్పగించాలని కోరుతూ ఉదయ్వీర్ నాలుగు పేజీల లేఖను పార్టీ చీఫ్కు రాశారు. అది తన ప్రతిపాదనే అయినప్పటికీ పార్టీ శ్రేణుల అంతరంగానికి ఇది అద్దం పడుతుందని మరీ చెప్పారు.
పార్టీ వేటు వేయడంపై ఉదయ్ వీర్ స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించానని, పార్టీ చీఫ్ను అసభ్యకర పదజాలంతో దూషించిన వాళ్లు కొందరు ఇంకా పార్టీలోనే ఉన్నారని, ఈ లేఖ ద్వారా నేను మర్యాదగా ఎవరు నిజంగా పార్టీ మంచిని కోరుకుంటున్నారో తెలిపానని, అందుకు తనను బహిష్కరించారన్నారు. ఇది జరిగిన మరుసటి రోజే అఖిలేష్ తండ్రికి షాకివ్వడం గమనార్హం.